అనారోగ్యాన్ని పక్కనపెట్టి పవన్ కల్యాణ్ హరిద్వార్కు.. అక్కడ ఏం చేస్తున్నారంటే!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ హరిద్వార్ పర్యటన తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని రేపింది. మీడియాకు ఎలాంటి సమాచారం లేకుండా హరిద్వార్లోని ప్రొఫెసర్ జీడీ అగర్వాల్ ఆశ్రమంలో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది. అయితే ఇలాంటి అనుమానాలకు తెరదించుతూ జనసేన పార్టీ కార్యాలయం పవన్ పర్యటనకు సంబంధించిన అధికారిక ప్రకటనను జారీ చేసింది. ఇంతకు హరిద్వార్లో పవన్ చేస్తున్నారంటే..
జీడీ అగర్వాల్ ప్రథమ వర్ధంతి కోసం
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన కార్యాలయానికి వచ్చి పవన్ కల్యాణ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జీడీ అగర్వాల్ ప్రథమ వర్ధంతికి హాజరుకావాలంటూ ఆహ్వానించారు. దాంతో తన ఆరోగ్యం సహకరించకున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి హరిద్వార్లోని కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కొద్దికాలంగా పవన్ వెన్నునొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
సంప్రదాయ తలపాగాతో
రాజేంద్రసింగ్ ఆహ్వానం మేరకు గురువారం సాయంత్రం డెహ్రాడూన్ చేరుకొని.. అక్కడి నుంచి నేరుగా హరిద్వార్లోని మాత్రి సదన్కు చేరుకొన్నారు. పవన్ కల్యాణ్ను సాదరంగా ఆహ్వానించి తలకు సంప్రదాయమైన తలపాగాను రాజేంద్రసింగ్ చుట్టారు. ఈ ఆశ్రమంలోనే జీడీ అగర్వాల్ గంగా ప్రక్షాళన కోసం పోరాటం చేశారు.
పవన్ కల్యాణ్కు గంగా ప్రక్షాళన పోరాటం గురించి
మాత్రా ఆశ్రమానికి సంబంధించిన శివానంద మహారాజ్ గంగా ప్రక్షాళన పోరాటాన్ని పవన్ కల్యాణ్కు వివరించారు. గంగా ప్రక్షాళన కోసం స్వామి నిగమానంద సరస్వతి ఏ విధంగా పోరాటం చేశారు. 115 రోజులు నిరాహర దీక్ష చేసి ఎలా ప్రాణత్యాగం చేశారనే విషయాన్ని వివరించారు. ఈ సందర్భంగా పవన్ పలు సమస్యలపై చేస్తున్న పోరాటాలను అభినందించి.. గంగా ప్రక్షాళన కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని సూచించారు.
జీడీ అగర్వాల్ విషయానికి వస్తే..
దివంగత జీడీ అగర్వాల్ విషయానికి వస్తే.. ఆయన పూర్తి పేరు గురుదాస్ అగర్వాల్. గంగా ప్రక్షాళన కోసం నిరంతర రాజీ లేని పోరాటం చేశారు. విద్యావేత్తగా, ఆధ్యాత్మిక గురువుగా ఎన్నో సామాజిక అంశాలపై ఉద్యమించారు. గంగా ప్రక్షాళన కోసం పోరాటం చేస్తూ 2018 అక్టోబర్ 11వ తేదీన ఆత్మార్పణ చేసుకొన్నారు. 1905లో పండిట్ మదన్ మోహన్ మాలవీయ స్థాపించిన గంగా మహాసభకు గౌరవ అధ్యక్షుడిగా సేవలందించారు.