Ayodhya verdict: అయోధ్య తీర్పుపై పవన్ కళ్యాణ్ స్పందన
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చారిత్రక అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పుపై స్పందించారు. అయోధ్యలోనే వివాదాస్పద భూమి హిందువులకే చెందుతుందని, ముస్లింలకు అయోధ్యలోనే వేరే ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల భూమి కేటాయించాలని కేంద్ర, రాస్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.
Ayodhya verdict: ఊహాజనితం కాదు! అయోధ్య తీర్పులో ఆర్కియాలజీ నివేదిక ఎలా కీలకమైందంటే..?
సుదీర్ఘ సమస్యకు పరిష్కారం..
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. రామ జన్మభూమిపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఇది భారతదేశ న్యాయవ్యవస్థకు ఉన్న స్వేచ్ఛకు నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు. సుదీర్ఘ సమస్యకు పరిష్కారం చూపిందని అన్నారు.
ధర్మాన్ని నిలబెట్టినందుకు..
ధర్మాన్ని నిలబెట్టినందుకు భారతదేశ ప్రజలందరూ హృదయపూర్వకంగా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. భారత్ మాతా కీ జై అంటూ తన ట్వీట్ను ముగించారు జనసేనాని పవన్ కళ్యాణ్.
సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పిందంటే..
కాగా, అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని ఆదేశించింది. ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు చెప్పింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ వేర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మోహి అఖారా వ్యాజ్యాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కులు కోరలేదని తెలిపారు. నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణలోకి తీసుకున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ చెప్పారు. అక్కడ మందిరం ఉన్నట్లు పురవాస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు.