25వేలు కొట్టు..! పార్టీ టికెట్ పట్టు..!! రాజకీయ పార్టీల వింత పోకడ..!!
హైదరాబాద్ : రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పోయిన చోటే వెతుక్కుందాం అన్న చందంగా తయారయ్యింది పార్టీల పరిస్థితి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేటప్పుడు సాధారణ రుసుము చెల్లించే మాదిరి ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులు కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ పొందాలంటే దరఖాస్తుతో పాటు 25వేలు రుసుము చెల్లించాల్సి ఉంది. కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అన్నాడీఎంకే తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీచేయాలనుకునే వారు టికెట్ కోసం ఫిబ్రవరి నాలుగు నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, అలాగే 25 వేలు ఫీజు కింద చెల్లించాలని ఆ పార్టీ ప్రకటించింది. పంజాబ్, చంఢీగడ్ కాంగ్రెస్ ఇంఛార్జి ఆశాకుమారీ సూచనల మేరకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇదేమీ మొదటిసారి కాదని పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ జాకడ్ వెల్లడించారు.
అన్నాడీఎంకే ఇలాంటి నోటిఫికేషన్ను 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా విడుదల చేసింది. తమిళనాడు, పుదుచ్చేరీ టికెట్ ఆశావహులు ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్ కూడా 2019న జరిగే ఎన్నికల కోసం ఈ రుసుమును వసూలు చేయాలని నిర్ణయించుకుంది. రిజర్వ్డ్ విభాగం వారికి దానిలో తగ్గింపును ప్రకటించింది. వారు దరఖాస్తుతో పాటు 20 వేలు చెల్లిస్తే సరిపోతుంది. పంజాబ్లో 13 లోక్సభ స్థానాలు ఉండగా, వాటిలో నాలుగు సీట్లను ఎస్సీ అభ్యర్థులకు రిజర్వ్ చేశారు. ఈ చర్యతో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిధుల కొరతతో ఇబ్బంది పడుతోన్న పార్టీలు కాస్త ఊరట పొందే అవకాశం ఉంది. చంఢీగడ్, హిమాచల్ ప్రదేశ్లో ఈ నిర్ణయాన్నే అమలు చేయాలనుకుంటున్నారు. ఇక ముందు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే పార్లిమెంట్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎలా ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళ్తాయో చూడాలి..!