పేటీఏం ఉద్యోగి కరోనా వైరస్, ఇటీవలే ఇటలీ వెళ్లొచ్చిన ఎంప్లాయ్, ఇతర ఉద్యోగులు బెంబేలు
కరోనా వైరస్ కేసులు గంట గంటకు పెరుగుతున్నాయి. దేశంలో 28 కేసులు నమోదు కాగా.. పేటీఏం ఉద్యోగికి కూడా వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. గురుగ్రామ్కి చెందిన ఉద్యోగి ఇటీవలే ఇటలీ నుంచి తిరిగొచ్చారని కంపెనీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగి ఇటీవలే వెకేషన్ కోసం ఇటలీ వెళ్లాడని పేర్కొన్నది.
గురుగ్రామ్లో గల ఆఫీసును వైద్యుల బృందం శుభ్రం చేసేవరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చినట్టు కంపెనీ పేర్కొన్నది. గురుగ్రామ్తోపాటు నోయిడా ఆఫీసు ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రం హోం ఇచ్చినట్టు తెలిపింది. తమ తోటి ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ సోకిందని, అతనికి మెరుగైన వైద్యం తీసుకుంటున్నారని సహచర ఉద్యోగి తెలిపారు. ఈ కఠిన సమయంలో కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా అనుమానం ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. వర్క్ ఫ్రం హోంతో పని కొనసాగుతోందని.. దీంతో సేవలకు అంతరాయం కలుగబోదని స్పష్టంచేశారు.
వెకేషన్ కోసం ఇటలీ వెళ్లిన ఉద్యోగి.. సోమవారం విధుల్లో చేరారు. అయితే అస్వస్థతకు గురవడంతో.. బుధవారం సప్తార్బంగ్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ కరోనా వైరస్ పాజిటివ్ బయటపడింది. దీంతో భయాందోళన నెలకొంది.