కాశ్మీర్లో పీడీపీ-బీజేపీ ప్రభుత్వం: ముఫ్తీ సీఎం, కమలానికి డిప్యూటీ!
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు పైన ఉత్కంఠకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ)లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. ఈ పార్టీల మధ్య చర్చలు ఫలప్రదమవుతున్నాయని అంటున్నారు.
బీజేపీ, పీడీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు పీడీపీ నేత ఒకరు చెప్పినట్లుగా తెలుస్తోంది. పీడీపీ నేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రి కానున్నారని తెలుస్తోంది. బీజేపీ, పీడీపీలు ఓ అండర్ స్టాండింగ్కు వస్తున్నాయని చెబుతున్నారు. ఇందుకు రెండు పార్టీల మధ్య పలు అంగీకారాలు కుదిరాయని తెలుస్తోంది.
సమాచారం మేరకు ముఫ్తీ సయిద్ మొహమ్మద్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. భారతీయ జనతా పార్టీకి చెందిన సభ్యుడికి ఉప ముఖ్యమంత్రి పదవి లభించనుంది. అలాగే ముఫ్తీ కేబినెట్లో ఆరుగురు పీడీపీ, ఎనిమిది మంది మంత్రులు తొలి విడతగా ఉండే అవకాశాలున్నాయి.
కాగా, ఇటీవల జరిగన అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ 28, బీజేపీ 25, నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు గెలుచుకుంది. మేజిక్ ఫిగర్ (44) స్థానాలు ఏ పార్టీకి రాకపోవడంతో పార్టీల మధ్య చర్చోపచర్చలు సాగాయి. చివరకు పీడీపీ - బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలుస్తోంది.