జమ్ము కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్కటైన బద్ధ శత్రువులు
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేదానికి మరో నిదర్శనం జమ్మూ కశ్మీర్లో బద్ద శత్రువులుగా ఉన్న మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ, ఒమర్ అబ్దుల్లా పార్టీ ఎన్సీలు కాంగ్రెస్తో కలిసి కనిపించే అవకాశం ఉంది. బీజేపీ పీడీపీకి మద్దతు ఉపసంహరించుకోవడంతో ఇక అక్కడ కొన్ని నెలలుగా రాష్ట్రపతి పాలన నడుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పీడీపీ, ఎన్సీ పార్టీలు ఒక్కటై ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం పీడీపీ సీనియర్ నేత ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి అల్తాఫ్ బుఖారీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్కటవుతున్న పీడీపీ కాంగ్రెస్ ఎన్సీ పార్టీలు
జమ్ముకశ్మీర్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బద్ద శత్రువులంతా మిత్రులుగా మారి జమ్ముకశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ ప్రభుత్వం రద్దయి కొన్ని నెలలు కావడంతో పాలనాపరంగా ఆ రాష్ట్రంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పీడీపీ సీనియర్ నేత బుఖారీ ఓ అడుగు ముందుకు వేసి అందరిని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నంచేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్ కూటమికి ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా నేతృత్వం వహించాలని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కోరుతున్నట్లు సమాచారం.
సీఎం అభ్యర్థిగా పీడీపీ సీనియర్ నేత అల్తాఫ్ బుఖారీ
ఒకవేళ కూటమి ఏర్పాటు అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పీడీపీ నేత అల్తాఫ్ బుఖారీ రేసులో ముందున్నారు. ఇదిలా ఉంటే ఎన్సీ మాత్రం కూటమిలో ఉండకుండా కాంగ్రెస్ పీడీపీలకు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫరూఖ్ చెప్పారు. బుధవారం సాయంత్రం కల్లా చర్చలు జరిపి ఆ తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ను కలుస్తారని సమాచారం. రాష్ట్రంలోని రెండు బద్ద శత్రువులు జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకహోదాను కాపాడటం కోసమే అని ఎన్సీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని రద్దు చేసేలా కేంద్రం గవర్నర్ను కోరే అవకాశం ఉందని తద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు చెక్ పెట్టే ఛాన్స్ కూడా ఉందని మరో ఎన్సీ సీనియర్ నేత అన్నారు. ఏది జరిగినా తమకు సమ్మతమే అని కూడా చెప్పారు.
మూడు పార్టీలు కలిస్తే సంఖ్యా బలం 55 ..మ్యాజిక్ ఫిగర్ 44
ఇదిలా ఉంటే పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)కి అసెంబ్లీలో 28 స్థానాలుండగా.. ఎన్సీకి 15 కాంగ్రెస్కు 12 స్థానాలున్నాయి.మూడు పార్టీలు కలిస్తే 55 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అన్ని అడ్డంకులు తొలుగుతాయి. మొత్తం 87 మంది సభ్యులున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 44. ఇదిలా ఉంటే గురువారం మధ్యాహ్నానికల్లా అన్ని అడ్డంకులు తొలిగిపోయి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగుమం అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. పీడీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా కమలం పార్టీ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చిందని ఆజాద్ ఆరోపించారు.