తాలిబన్లతో శాంతి చర్చలు... ఇంట్రా-ఆఫ్ఘన్ చర్చల్లో కేంద్రమంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు...
శనివారం(సెప్టెంబర్ 12) ఖతార్లోని దోహాలో జరిగిన ఇంట్రా-ఆఫ్ఘన్ చర్చల ప్రారంభానికి భారత్ హాజరైంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి,తాలిబన్లకు మధ్య శాంతి చర్చల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. భారత్ తరుపున ఓ సీనియర్ ఉన్నతాధికారి కార్యక్రమానికి హాజరవగా... విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ... ఆఫ్ఘన్ నేత్రుత్వంలో,ఆఫ్ఘన్ కోసం,ఆఫ్ఘన్ నియంత్రణలో ఈ శాంతి చర్చల ప్రక్రియ కొనసాగాలన్నారు.
Recommended Video
Addressed the conference on Afghan peace negotiations at Doha today. Conveyed that the peace process must:
— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 12, 2020
• Be Afghan-led, Afghan-owned and Afghan-controlled
• Respect national sovereignty and territorial integrity of Afghanistan
• Promote human rights and democracy pic.twitter.com/wFG3E2OVlJ
ఆఫ్ఘన్ జాతీయ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలన్నారు. మానవ హక్కులు,ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడం, మైనారిటీలు, మహిళలు,బలహీన వర్గాల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దేశవ్యాప్తంగా హింసను సమర్థవంతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.ఆఫ్ఘన్తో భారత్ చారిత్రక సంబంధాలకు ఇరు దేశాల స్నేహపూర్వక సంబంధాలే నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 29న జరిగిన అమెరికా-తాలిబన్ శాంతి ఒప్పంద నేపథ్యంలో తాజా చర్చలు జరుగుతున్నాయి. అప్పటి ఆ ఒప్పంద సమావేశానికి భారత్ కూడా హాజరైంది. ఖతార్లోని భారత రాయబార కార్యాలయ అధికారి పి.కుమారన్ అందులో పాల్గొన్నారు. ఈసారి సమావేశానికి మాత్రం భారత్ నుంచే ఓ ఉన్నతాధికారిని పంపించడం గమనార్హం. నిజానికి నెల క్రితమే ఈ సమావేశాలు జరగాల్సి ఉన్నా... వివిధ కారణాలతో ఆలస్యమైంది. గురువారం(సెప్టెంబర్ 10) ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆరుగురు తాలిబన్ ఖైదీలను విడిచిపెట్టడంతో ఎట్టకేలకు శాంతి చర్చలకు తాలిబన్లు ముందుకొచ్చారు.
ఇటీవలే కేంద్రమంత్రి జైశంకర్ ఇరాన్ వెళ్లి ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులపై చర్చించారు. ఆ తర్వాత రెండు రోజులకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇరాన్ రక్షణ శాఖ మంత్రి జావద్ జరీఫ్ను కలిసి ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులపై చర్చించారు. ఆఫ్ఘనిస్తాన్లో శాంతి ప్రక్రియ కోసం భారత్ మొదటినుంచి చొరవ చూపుతూనే ఉంది.