నెమళ్లు 'సెక్స్' చేయవు, అందువల్లే జాతీయ పక్షిని చేశారు: రాజస్థాన్ హైకోర్టు జడ్జి మరో సంచలనం
మగ నెమలి బ్రహ్మచారి గానే ఉండిపోతుందని ఆడ నెమలితో అసలు శృంగారంలో పాల్గొనబోదని పేర్కొన్నారు.
జైపూర్: ఓవైపు దేశవ్యాప్తంగా గోమాంస నిషేధంపై నిరసనలు వెల్లువెత్తుతుంటే.. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు జడ్జి మహేశ్ చంద్ర సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సంచలనం మరువకముందే ఆయన నోటి నుంచి మరిన్ని విస్తుపోయే వ్యాఖ్యలు రావడం మరో సంచలనానికి దారితీసింది.
నెమళ్లు బ్రహ్మచారులు కావడం వల్లే వాటిని జాతీయపక్షిగా ప్రకటించారని, అవి శృంగారంలో పాల్గొనవంటూ మహేశ్ చంద్ర బాంబు పేల్చారు. మగ నెమలి బ్రహ్మచారి గానే ఉండిపోతుందని ఆడ నెమలితో అసలు శృంగారంలో పాల్గొనబోదని పేర్కొన్నారు.
మగ నెమలి కన్నీళ్లు తాగడం ద్వారానే ఆడ నెమలి గర్భం దాలుస్తుందని, అందుకే శ్రీకృష్ణుడి లాంటి వాడు నెమలి పించాన్ని తలపై ధరించాడని మహేశ్ చంద్ర వ్యాఖ్యానించారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలన్న వ్యాఖ్యలపై మీడియాకు వివరణ ఇస్తున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
నేపాల్ ఇప్పటికే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించిందని, భారత్ కూడా ఆత్మపరిశీలన చేసుకుని ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని సూచించారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలన్న డిమాండ్ కు లౌకిక వాదంతో సంబంధంతో లేదని పేర్కొన్నారు.