బహిరంగ ప్రదేశంలో మూత్రం పోసిన యువకుడు, మహిళలు చుట్టుముట్టి, కట్టేసి!
Recommended Video
బెంగళూరు: ప్రముఖ హోటల్స్ గ్రూప్ యజమాని కుమారుడు బహిరంగ ప్రదేశంలో మూత్రవిసర్జన చేశాడని ఆరోపిస్తూ స్థానిక మహిళలు అతన్ని విద్యుత్ స్థంభానికి కట్టి చితకబాదిన ఘటన కర్ణాటకలోని ఉడపి సమీపంలోని కుందాపురలో జరిగింది.
హోటల్స్ వ్యాపారి కుమారుడు కొంత కాలంగా మానసిక అస్వస్థతకు గురైనాడని సమాచారం. ఆ యువకుడు కుందాపురలోని ఎల్ఐసీ కాలనీలో కొంత కాలంగా బహిరంగంగా మూత్రవిసర్జన చేస్తున్నాడు. ఈ విషయం స్థానికులు గుర్తించారు.
మహిళలు వెలుతున్న సమయంలో ఆ యువకుడు ఎల్ఐసీ కాలనీలో బహిరంగంగా మూత్రవిసర్జన చేశాడు. ఈ విషయం గుర్తించిన మహిళలు అందరూ గుమికూడి ఆ యువకుడిని పట్టుకుని అక్కడే ఉన్న విద్యుత్ స్థంభానికి కట్టేశారు.
మహిళలతో పాటు స్థానికులు యువకుడిని చితకబాదేశారు. విషయం తెలుసుకున్న కుందాపుర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని కాపాడారు. తరువాత యువకుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.
యువకుడికి వివాహం అయ్యి పిల్లలు ఉన్నారని, కొంత కాలంగా మానసిక అస్వస్థతకు గురైనాడని, వైద్యం చేయిస్తున్నామని అతని కుటుంబ సభ్యులు చెప్పారని పోలీసులు అన్నారు. బహిరంగ మూత్రవిసర్జన చేస్తే పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలని, లేదంటే మాకు సమాచారం ఇవ్వాలని, ఇలా దాడి చెయ్యడం ఏమిటని యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు మండిపడుతున్నారు.