షాకింగ్: భారతీయ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల వాట్సాప్పై నిఘా.. ఇజ్రాయిల్ సంస్థ నిర్వాకం
ప్రముఖ ఫేస్బుక్కు చెందిన పాపులర్ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ షాకింగ్ విషయాలను బయటపెట్టింది. దేశంలోని పలువురు జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలకు సంబంధించిన వాట్సాప్ అకౌంట్లపై ఇజ్రాయిల్కు చెందిన స్పైవేర్ పెగసస్ ద్వారా నిఘా పెట్టినట్టు వెల్లడైన విషయం నివ్వెరపాటుకు గురిచేస్తున్నది. అమెరికాలొని శానిఫ్రానిసిస్కోలోని యూఎస్ ఫెడరల్ కోర్టులో మంగళవారం నమోదైన పిటిషన్తో ఈ విషయం బయటపడింది.
ఇజ్రాయిల్కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ దాదాపు 1400 వాట్సాప్ వినియోగదారులను పెగసస్ అనే నిఘా సాఫ్ట్వేర్తో టార్గెట్ చేసిందనే విషయం తెలిసింది. అయితే ఏ ఫోన్ నెంబర్లు, ఎవరిపై నిఘా పెట్టిందనే విషయాన్ని వెల్లడించడానికి నిరాకరించడం గమనార్హం. ఈ సంచనల విషయంపై యూఎస్కు చెందిన కమ్యూనికేషన్ వ్యవస్థ డైరెక్టర్ కార్ల్ ఉగ్ వివరాలను ప్రముఖ దినపత్రికతో పంచుకొన్నారు.
2019లో ఈ నిర్వాకం
అమెరికాకు చెందిన కార్ల్ ఉగ్ తెలిపిన ప్రకారం.. భారతీయ జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలను నిఘా సాఫ్ట్వేర్ ద్వారా టార్గెట్ చేశారు. ఎవరినీ, ఏ ఏ నంబర్లపై దృష్టిపెట్టారనే విషయాన్ని వెల్లడించలేను. అయితే పెద్ద సంఖ్యలో మాత్రం కాదని మాత్రం చెప్పగలను అని అన్నారు. ఇలా టార్గెట్ చేసిన వారిలో విద్యావేత్తలు, లాయర్లు, దళిత నాయకులు, జర్నలిస్టులు ఉన్నారనే విషయం బయటపెట్టారు. రెండు వారాలపాటు జరిగిన ఈ వ్యవహారమంతా మే 2019 వరకు కొనసాగినట్టు తెలిసింది.
చట్టాలు, నిబంధనల ఉల్లంఘన
ఇదిలా ఉండగా, ఎన్ఎస్వో, క్యూ సైబర్ టెక్నాలజీస్, వాట్సాప్పై దాఖలైన పిటిషన్లలో తీవ్ర ఆరోపణలు వ్యక్తమయ్యాయి. యూఎస్, కాలిఫోర్నియా చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా వాట్సాప్ నిబంధనలను కూడా తుంగలో తొక్కిందని ఆరోపించింది. మిస్డ్ కాల్స్ ద్వారా స్మార్ట్ఫోన్లపై నిఘా పెట్టడం జరిగిందనే విషయాన్ని స్పష్టం చేసింది. ఇలా 100 మందికిపైగా సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొన్నదని, ఇదంతా నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నది. బాధితులంతా ముందుకు వస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది.
ఆరోపణలపై ఖండన
అయితే తమ సంస్థపై వచ్చిన ఆరోపణలపై ఎన్ఎస్వో గ్రూప్ స్పందించింది. మాపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వాటికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తాం. జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలను టార్గెట్ చేయడానికి మా సాంకేతికతను డిజైన్ చేయలేదు, లైసెన్స్ ఇవ్వలేదు అని స్పష్టం చేసింది.
భారతీయ అధికారుల నుంచి స్పందన
ఈ వ్యవహారంపై ఈమెయిల్స్, ఫోన్ కాల్స్, మెసేజ్ ద్వారా హోం శాఖ కార్యదర్శి ఏకే భల్లా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రెటరీ ఏపీ సానీ నుంచి వివరాలను సేకరించడానికి ప్రయత్నించగా ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం ప్రముఖ దినపత్రిక పేర్కొన్నది. కాగా, సుమారు 40 వరకు పెగసస్ ఆపరేటర్లు భారత్తోపాటు 45 దేశాల్లో నిఘా పెట్టిందని సెప్టెంబర్ 2018లో కెనడాకు చెందిన సెక్యూరిటీ సంస్థ సిటిజెన్ ల్యాబ్ వెల్లడించింది.