పెహ్లూఖాన్ డైరీ కోసం గోవులు తీసుకెళ్తున్నారు.. అక్రమ రవాణా కాదు..
కలకలం రేపిన పెహ్లూఖాన్ కేసులో రాజస్థాన్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పెహ్లూఖాన్, అతని కుమారులు ఇర్షాద్, ఆరిఫ్పై ఉన్న గోవుల అక్రమ తరలింపు అభియోగాలను కొట్టివేసింది. వారు గోవులను డైరీ కోసం తీసుకెళ్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో గోవుల అక్రమ రవాణా కింద నమోదైన ఎఫ్ఐఆర్ను కోర్టు కొట్టివేసింది.
2017లో హెహ్లూఖాన్, అతని కుమారులతో కలిసి హర్యానాలోని తమ స్వగ్రామం నుహ్ గ్రామానికి గోవులను తరలిస్తున్నారు. జైపూర్లోని మార్కెట్లో వారు గోవులను కొనుగోలు చేసి తరలిస్తున్నారు. ఇంతలో కొందరు హిందుసంస్థలకు చెందినవారు అడ్డుకొని వారిపై దాడిచేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ పెహ్లూఖాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. రెండురోజుల తర్వాత చనిపోయాడు. అతని కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. వారు అక్రమంగా గోవులను తరలిస్తున్నారనే అభియోగంపై కేసు నమోదైంది.
ఈ కేసులో వాదోపవాదనలు జరుగుతున్నాయి. అయితే పెహ్లూఖాన్ గోవులను వధించడం కోసమే తీసుకెళ్తున్నారని అభియోగాలు నమోదు చేశారు. కానీ పెహ్లు ఖాన్ తరఫు న్యాయవాది కపిల్ గుప్తా మాత్రం గోవులను తరలించడం లేదని రాజస్థాన్ సింగిల్ బెంచ్ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఆ గోవులు కేవలం రెండేళ్ల వయస్సు ఉన్నవని.. వాటిని తీసుకెళ్లి హతమార్చాబోరని వాదనలు వినపించారు.
అంతేకాదు రాజస్థాన్ బోవిన్ యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారని గుర్తుచేశారు. అయితే పోలీసులు మాత్రం ఒక రాష్ట్రం నుంచి మరొ రాష్ట్రానికి గోవులను తరలిస్తే సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని కోరారు. కానీ పెహ్లూ ఖాన్ అలా పర్మిషన్ తీసుకోలేదని వివరించారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత గోవుల తరలింపు అభియోగాలను కొట్టివేస్తున్నట్టు మేజిస్ట్రేట్ తెలిపారు.