గోసంరక్షల చేతిలో మృతి చెందిన పెహ్లుఖాన్ పేరు చార్జిషీట్లో చేర్చిన గెహ్లాట్ ప్రభుత్వం
రాజస్థాన్ : పెహ్లు ఖాన్.. ఈ పేరు గుర్తు ఉండి ఉంటే ఉంటుంది. గోవులను స్మగ్లింగ్ చేశాడన్న ఆరోపణలపై 2017లో రాజస్థాన్లోని అల్వార్లో అతన్ని కొందరు గోసేవకులు కొట్టి చంపారు. ఇప్పుడు గెహ్లాట్ ప్రభుత్వం పెహ్లు ఖాన్ కుమారులు ఇర్సద్, ఆరిఫ్లపై కేసులు నమోదు చేసింది. అంతేకాదు రాజస్థాన్ జంతు సంరక్షణ చట్టం కింద మృతుడు పెహ్లు ఖాన్పై కూడా సెక్షన్ 6 కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే పెహ్లు ఖాన్ పై రాజస్థాన్ ప్రభుత్వం కేసు నమోదు చేసి క్రెడిట్ తీసుకున్నందుకు బీజేపీ నేత గ్యాన్ దేవ్ అహుజా కాంగ్రెస్ పై మండిపడ్డారు.
"పెహ్లుఖాన్ తన వాహనంలో గోవులను స్మగ్లింగ్ చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. అయితే పోలీసు కస్టడీలో పెహ్లుఖాన్ మృతి చెందాడు. స్థానికులు అతన్ని కొట్టలేదు. ఇప్పుడు చార్జిషీట్ దాఖలు చేయగానే కాంగ్రెస్ క్రెడిట్ తీసుకుంటోంది. ఆ సమయంలో కాంగ్రెస్ పెహ్లుఖాన్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసింది" అని బీజేపీ నేత గ్యాన్ దేవ్ అహుజా అన్నారు. ఇదిలా ఉంటే గతేడాది డిసెంబర్ 30వ తేదీన పెహ్లూ ఖాన్పై రాజస్థాన్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 13 రోజుల్లోనే కేసు నమోదు చేసింది.
రాజస్థాన్ బొవైన్ యానిమల్ యాక్ట్లోని సెక్షన్ 5 ప్రకారం జంతువులను మరో ప్రాంతానికి తరలించి వధించాలని భావిస్తే నేరమని చెబుతోంది. ఎవరైతే ఈ పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారో అట్టివారు కూడా సెక్షన్ 6 కింద అదే శిక్ష పడుతుందని చట్టం చెబుతోంది. సెక్షన్ 8 జరిమానా గురించి చెబుతుండగా సెక్షన్ 9 ఎలాంటి శిక్ష విధించాలో చెబుతోంది. 2018లో పెహ్లు ఖాన్ మనుషులపై అప్పటి బీజేపీ సర్కార్ కేసులు నమోదు చేసింది. వారిని కూడా స్థానికులు చితకబాదారు.
ఈ ఘటనలో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఒకటి ఖాన్ను కొట్టి చంపిన వారిపై రెండోది పెహ్లు ఖాన్ గోవులను రవాణా చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. అయితే ఖాన్ను కొట్టి చంపిన ఆరుగురికి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. గోసంరక్షణ సిబ్బంది ఇచ్చిన సమాచారం, ఫోన్ రికార్డింగులను పరిశీలించిన మీదట ఆరుగురికి పెహ్లు ఖాన్ కేసుతో సంబంధం లేదని పోలీసులు నిర్ణయించారు. 2017 ఏప్రిల్ 1న పెహ్లూ ఖాన్ గోవులను అక్రమంగా మరో రాష్ట్రానికి తరలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న గోసంరక్షకులు వాహనాన్ని అడ్డుకుని 55 ఏళ్ల పెహ్లుఖాన్ను చితకబాదారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెహ్లూ ఖాన్ ఏప్రిల్ 3న మృతిచెందాడు.