ఆధార్ లేదని పింఛను ఆపొద్దు: బ్యాంకులకు తేల్చి చెప్పిన ఈపీఎఫ్ఓ
న్యూఢిల్లీ: ఆధార్ లేదన్న కారణంతో పింఛను చెల్లింపు నిరాకరించకూడదని బ్యాంకులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాల ఆధారంగా చెల్లింపులు జరపాలని సూచించింది.
పింఛను పంపిణీ జరుపుతున్న తపాలా సేవలు, బ్యాంకుల అధిపతులకు ఈ మేరకు ఈపీఎఫ్ఓ లేఖరాసింది. 'ఆధార్ లేనివారి గుర్తింపును సరైన ప్రత్యామ్నాయ విధానాల్లో నిర్ధారించుకోవాలి. ఆధార్ ఉన్నప్పటికీ.. వృద్ధుల వేలిముద్రలను సరిగా గుర్తించలేకపోతే.. కనుపాప(ఐరిస్) స్కానర్ల ద్వారా గుర్తింపును నిర్ధారించాలి' అని పేర్కొంది.
జీవన ధ్రువీకరణ పత్రాలను పింఛనుదారులు 2016 నుంచి 'జీవన్ ప్రమాణ్' పేరుతో డిజిటల్ రూపంలో సమర్పిస్తున్నారు. అయితే, ఆధార్ లేనివారికి ఈ ధ్రువీకరణ పత్రాలు అందడంలేదు. వేలిముద్రలు గుర్తించలేనంతగా మారినవారికి కూడా ఈ పత్రాలు మంజూరవ్వడం లేదు. అలాంటి వ్యక్తుల నుంచి సాధారణ కాగితపు ధ్రువీకరణ పత్రాలను తీసుకొని పింఛను చెల్లించాలి.
నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు ఆధార్ కార్డు పొందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఆధార్ అనుసంధానం పూర్తికానంత మాత్రాన వృద్ధులకు పింఛను చెల్లింపులో జాప్యం చోటుచేసుకోకూడదని కేంద్ర సమాచార కమిషన్ మంగళవారం స్పష్టం చేసింది. ఏటా నవంబరులో పింఛనుదారుల నుంచి అవసరమైన సర్టిఫికేట్లను సేకరించడంతోపాటు పింఛను తీసుకోవడం కోసం సంతకం చేసిన ఒప్పంద పత్రాలను బ్యాంకులు తీసుకోవాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది.