ఇక 'కాంగ్రెస్' పని అయిపోయినట్లేనా..? ప్రజలకు పార్టీ దూరమైందా..? కపిల్ సిబల్ బిగ్ బాంబ్...
దేశంలో ఎన్డీయేని ఎదుర్కోవడం ఇక కాంగ్రెస్ వల్ల అయ్యే పనేనా... ఇటీవలి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి చూశాక చాలామంది వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది. బయటి వ్యక్తులే కాదు... సొంత పార్టీ నేతలు సైతం కాంగ్రెస్ సత్తాపై సందేహం వెలిబుచ్చుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ జాతీయ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో... దేశ ప్రజలు కాంగ్రెస్ను ప్రత్యామ్నాయంగా భావించట్లేదని పెద్ద బాంబే పేల్చారు. సంస్థాగత లోపాలు సరిదిద్దుకోకుండా పార్టీ పుంజుకోవడం అసాధ్యమన్నారు.
ఇదీ రియాలిటీ.. : కపిల్ సిబల్
'బిహార్ ఎన్నికలే కాదు... దేశంలో ఉపఎన్నికలు జరిగిన ప్రతీచోటా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయంగా భావించలేదు. ఇదే తేలింది. బిహార్లో బీజేపీకి ప్రత్యామ్నాయం ఆర్జేడీ అని ప్రజలు భావించారు. గుజరాత్లోనూ కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేకపోయింది. ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు అక్కడ డిపాజిట్ కోల్పోయారు. లోక్సభ ఎన్నికల్లోనూ గుజరాత్లో పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల్లో కొన్నిచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు 2 శాతం కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి.' అని కపిల్ సిబల్ పేర్కొన్నారు.
ఇంకెప్పుడు ఆత్మపరిశీలన...
'సీడబ్ల్యూసీ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకుంటుందన్నారు. ఆరేళ్లుగా ఆత్మపరిశీలన చేసుకోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాత్రం ఆ పనిచేస్తుందని ఎలా నమ్మగలం. కాంగ్రెస్లో ఉన్న అసలు లోపమేంటో అందరికీ తెలుసు. కానీ వాటి గురించి మాట్లాడేందుకు కాంగ్రెస్ సిద్దంగా లేదు. సంస్థాగత లోపాలను సరిదిద్దుకోలేకపోతే కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతూనే ఉంటుంది. సీడబ్ల్యూసీ నామినేటెడ్ బాడీ కావడం పట్ల కూడా వ్యతిరేకత ఉంది. సీడబ్ల్యూసీ ఎంపిక ప్రజాస్వామ్యయుతంగా జరగాలి. అంతే తప్ప,నామినేటెడ్ వ్యక్తులను సీడబ్ల్యూసీలో కూర్చోబెట్టి పార్టీని బాగుచేయాలంటే వారి వల్ల కాని పని.' అని సిబల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పార్టీలో చర్చే జరగలేదు...
ఈ ఏడాది అగస్టులో 23 మంది కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖలు రాసినా... ఇప్పటికీ దానిపై చర్చ జరగలేదన్నారు. కనీసం ఆ నేతలతో మాట్లాడేందుకు కూడా నాయకత్వం ప్రయత్నించలేదన్నారు. దీంతో తమ అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు వేదికే లేకుండా పోయిందని... అందుకే ఇలా బహిరంగంగా మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. అయినప్పటికీ... తాను ఇప్పటికీ,ఎప్పటికీ కాంగ్రెస్ వ్యక్తినేని స్పష్టం చేశారు.
Recommended Video
ఇక ఆశించలేం...
కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందన్న కపిల్ సిబల్... ఎన్నికల వాతావరణానికి తగ్గట్లుగా మార్పులు అవసరం అన్నారు. ప్రధాన స్రవంతి మీడియా అధికార పార్టీ నియంత్రణలో ఉంటోందని.. కాబట్టి ప్రజలకు చేరువయ్యేందుకు కొత్త మెకానిజం అవసరమని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికల్లో కాంగ్రెస్ క్రియాశీలకంగా ఉన్నప్పటికీ... ఫలితాలను రాబట్టడంలో మాత్రం విఫలమవుతోందన్నారు. కాబట్టి గ్రౌండ్లో ఫలితాలు రాబట్టాలంటే మేదావులతో,అనుభవజ్ఞులతో,రాజకీయ నిపుణులతో చర్చలు జరపాలన్నారు. మీడియాతో ఎలా వ్యవహరించాలో... ప్రజలను తమవైపు ఎలా తిప్పుకోవాలో తెలిసినవాళ్లతో చర్చలు అవసరమన్నారు. ఇక ప్రజలు కాంగ్రెస్ వద్దకు వస్తారని ఆశించలేమని... పార్టీయే ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు.