మీ మన్ కీ బాత్ ఎవరిక్కావాలి.. జన్ కీ బాత్ వినండి: నరేంద్ర మోడీకి ఉద్ధవ్ థాకరే చురకలు
ముంబై: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర ఓటమి పాలు కావడం పట్ల రాజకీయ ప్రత్యర్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను టార్గెట్గా చేసుకుని తమ విమర్శనాస్త్రాలకు పదును పెడుతున్నారు. నరేంద్ర మోడీ-అమిత్ షా అహంకారానికి, మత రాజకీయాలకు ఈ ఓటమి ఓ చెంపపెట్టుగా అభివర్ణిస్తున్నారు. మత రాజకీయాలను దేశ ప్రజలు ఎప్పుడూ ఆదరించబోరని అంటున్నారు.
విద్యార్థులు..యువ బాంబుల్లా కనిపిస్తున్నారా? మరో జలియన్ వాలా బాగ్: ఉద్ధవ్..!
శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రధానమంత్రిపై ఘాటు విమర్శలను సంధించారు. మోడీ తరచూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారని, దాన్ని వదిలేసి.. జన్ కీ బాత్ వినాల్సిన సమయం ఆసన్నమైందని హితబోధ చేశారు. ఢిల్లీలో ఘన విజయాన్ని సాధించిన ఆమ్ఆద్మీ పార్టీని, ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఆయన అభినందించారు. సో కాల్డ్ జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన భారతీయ జనతా పార్టీ.. ఓ సామాన్యుడి చీపురు కట్ట ముందు నిలవలేకపోయిందని ఎద్దేవా చేశారు.
ప్రజలను విడగొట్టే మత రాజకీయాలను ఏనాడూ ప్రజలు ఆదరించబోరనే విషయాన్ని బీజేపీ ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని సూచించారు. వందలాది మంది పార్టీ రాజ్యసభ, లోక్సభ సభ్యలు, కేంద్రమంత్రులను ప్రచార బరిలోకి దింపినప్పటికీ బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం రెండంకెల స్థానాలను కూడా అందుకోలేకపోయందని చురకలు అంటించారు. ఢిల్లీ వాసులను భ్రమల్లో ముంచెత్తే ప్రయత్నం చేసిందని, అయినప్పటికీ.. కేజ్రీవాల్ అభివృద్ధి ముందు చేతులెత్తేసిందని అన్నారు.