రిటైర్మెంట్ వేళ.. న్యాయ వ్యవస్థపై జస్టిస్ దీపక్ గుప్తా సంచలన వ్యాఖ్యలు..
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ రాజ్యసభ పదవి స్వీకరించడంపై తాజా మాజీ సుప్రీం న్యాయమూర్తి దీపక్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు దీన్ని అసంబద్దంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు,దేశ న్యాయ వ్యవస్థ సంపన్నులకు,శక్తివంతులకు అనుకూలంగా పనిచేస్తుందని మరో సంచలన కామెంట్ చేశారు. న్యాయమూర్తిగా రిటైర్ అవుతున్న సందర్భంగా బుధవారం(మే 6) ఏర్పాటు చేసిన వర్చువల్ ఫేర్వెల్లో ఆయన మాట్లాడారు. భారతదేశ చరిత్రలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీడ్కోలు పొందిన మొట్టమొదటి న్యాయమూర్తి దీపక్ గుప్తానే కావడం విశేషం.
కరోనా భయంలోనూ రాత్రంతా రోడ్ల మీదే బిక్కుబిక్కుమంటూ గడిపిన జనం.. కారణం?
దీపక్ గుప్తా సంచలన వ్యాఖ్యలు
రిటైర్మెంట్ సందర్భంగా ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన దీపక్ గుప్తా పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అభిప్రాయం ప్రకారం.. జడ్జిలు రిటైర్మెంట్ అయిన వెంటనే ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగమైతే ప్రజలు హర్షించరు అని చెప్పారు. పైగా వాళ్ల మదిలో సందేహాలు కూడా ఉత్పన్నమవుతాయని అన్నారు. న్యాయమూర్తి రాజకీయ పదవి పొందడం వెనుక వేరే ఏదో కారణం ఉండి ఉంటుందని ప్రజలు భావిస్తారన్నారు. తప్పో,ఒప్పో పక్కనపెడితే.. ప్రస్తుత ప్రపంచంలో చాలామంది ప్రజల ఆలోచనా విధానం ఇలాగే ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాజకీయ పదవులు పొందడాన్ని వ్యక్తిగతంగా తాను సమర్థించనని స్పష్టం చేశారు. తాను అలాంటి పనులు చేయనని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి రాజకీయ పదవిని చేపట్టనని తెలిపారు. భారతదేశ చరిత్రలో ఇద్దరు మాజీ సీజేఐలు(పి సదాశివం,రంజన్ గొగొయ్)లు రాజకీయ పదవులు చేపట్టడాన్ని మీరెలా చూస్తారు అన్న ప్రశ్నకు సమాధానంగా దీపక్ గుప్తా ఈ వివరణ ఇచ్చారు.
రిటైర్మెంట్ తర్వాత.. నెక్ట్స్ ఏంటి..
తన దివంగత మిత్రుడు అరుణ్ జైట్లీ ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవాడని దీపక్ గుప్తా గుర్తుచేసుకున్నారు. న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును తప్పక పెంచాల్సిన అవసరం ఉందని జైట్లీ చెప్పేవాడని అన్నారు. రిటైర్మెంట్ తర్వాత జడ్జిలకంటూ ప్రభుత్వపరంగా ప్రత్యేక జాబ్స్ ఏమీ ఉండవు కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పేవాడన్నారు.అయితే తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం రిటైర్మెంట్ తర్వాత జడ్జిలకు ప్రభుత్వ పరంగా ఎలాంటి పదవులు ఉండకూడదన్నారు. అత్యంత బ్రిలియంట్గా అందరూ భావించే జస్టిస్ ఫజల్ అలీ సైతం ఒకప్పుడు గవర్నర్ చేపట్టారని.. కానీ ఇప్పుడు కాలం మారిపోయిందని అన్నారు. ప్రజలు న్యాయ వ్యవస్థను చూసే దృక్పథంలో మార్పు వచ్చిందన్నారు.
2018 సుప్రీం న్యాయమూర్తుల ప్రెస్మీట్పై గుప్తా..
2018లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రెస్ మీట్పై కూడా గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో సీజేఐపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు,మెడికల్ అడ్మిషన్ స్కామ్ కేసులపై న్యాయమూర్తులంతా కలిసి చర్చించారా అన్న ప్రశ్నకు లేదు అని బదులిచ్చారు. దురదృష్టవశాత్తు అలాంటిదేమీ జరగలేదన్నారు. ఇలాంటి విషయాల్లో సీజేఐ నిర్ణయమే ప్రధానమని,ఆయన కొంతమంది సీనియర్ జడ్జిలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. మూడేళ్లుగా తాను జడ్జిగా పనిచేసినప్పటికీ.. సీజేఐ న్యాయమూర్తులందరినీ సంప్రదించిన సందర్భమేదీ లేదన్నారు.