బీజేపీ అఖండ విజయం ఎలా సాధ్యమైంది...అన్ని ఈక్వేషన్స్ కమలానికే సానుకూలం
ఢిల్లీ: దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.అయితే ఇంత భారీ విజయం ఎలా సాధ్యమైందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మొత్తం 303 సీట్లు, 37.6 శాతం ఓటు షేరును బీజేపీ సంపాదించుకుంది. ఇక ఈసారి ఓటు శాతం పెంచుకోవడమే కాక.. బీజేపీకి స్థానం లేదన్న రాష్ట్రాల్లో కూడా సీట్లు గెలిచి సత్తా చాటింది.
అన్ని వర్గాల్లో కనిపించిన మోడీ మేనియా
2019 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ మేనియా అన్ని వర్గాల్లో కనిపించిందని బీజేపీకి వచ్చిన ఫలితాలే వెల్లడిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో సీట్లు సాధించినప్పటికీ కొన్ని చోట్ల బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఆయా రాష్ట్రాల్లో కమలనాథులు సత్తా చాటారు. ప్రాంతాల పరంగా కానీ, సామాజిక సమీకరణాల పరంగా కానీ బీజేపీ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, అస్సోం, ఉత్తరాఖండ్, చత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్లలో బీజేపీ తన సీట్ల సంఖ్యలో 2014తో పోలిస్తే ఎక్కువ సీట్లే సాధించింది. ఈ రాష్ట్రాల్లో దాదాపు 50శాతం ఓటు షేరును సాధించింది బీజేపీ.
బెంగాల్, ఒడిషా, త్రిపురా రాష్ట్రాల్లో కమల వికాసం
ఇక బెంగాల్, ఒడిషా, త్రిపురా తెలంగాణలో బీజేపీ కచ్చితంగా పుంజుకుందనే చెప్పాలి. ఇక్కడ ఓటుబేసు లేని బీజేపీ సత్తా చాటడం చూస్తే ఈ పార్టీ ఎలాంటి విక్టరీ నమోదు చేసిందో అర్థమవుతుంది. దీని ద్వారా బీజేపీ ఓటు బ్యాంకు ఈ రాష్ట్రాల్లో క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ సాధించింది. అేదసమయంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారిని కూడా బీజేపీ ఆకట్టుకుంది. ఉత్తర్ ప్రదేశ్, బీహార్, కర్నాటక, మహారాష్ట్ర, జార్ఖండ్లలో బీజేపీ జతకట్టడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో ఉండే వివిధ సామాజిక వర్గాల వారిని తమవైపు తిప్పుకుంది బీజేపీ.
గ్రామీణ ఓటర్లు, ముస్లిం ఓటర్లను సైతం ఆకట్టుకున్న బీజేపీ
ఇక బీజేపీ ఈసారి గ్రామీణ భారతంలోని ఓటర్లను కూడా ఆకట్టుకుంది. అదేసమయంలో పట్టణ ప్రాంతాల ఓటు బ్యాంక్ను కూడా తమ వైపే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. గ్రామీణ ప్రాంతంలో బీజేపీ ఓటుశాతం ఈసారి 6.6 శాతం పెరిగింది. ఇక కుల సమీకరణాలు సామాజిక సమీకరణాలను గమనిస్తే ఉత్తర్ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్నాటకాల్లో బీజేపీకి అనుకూలంగా మారాయి. ఈ రాష్ట్రాల్లో దళితులు, ఆదివాసీలు, ముస్లింల ఓట్లు కూడా బీజేపీకి పడినట్లు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీకి 8శాతం ముస్లిం సామాజిక ఓట్లు పడినట్లు సీఎస్డీఎస్ పోస్ట్ పోల్ సర్వే వెల్లడించింది.