నువ్వా..నేనా: ఖవ్వాలి ఈవెంట్ రసాభసా: కుర్చీలతో కొట్టుకున్న ప్రేక్షకులు..!
డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఏర్పాటు చేసిన ఓ ఖవ్వాలి కార్యక్రమం రసాభాసగా ముగిసింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రేక్షకులు నిర్వాహకుల ఏర్పాట్లపై తీవ్ర అసహనానికి గురయ్యారు. వారిపై కుర్చీలతో దాడికి దిగారు. కుర్చీలను విరగ్గొడుతూ, వాటితో నిర్వాహకులను వెంటాడారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ వేదిక ఆవరణలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
హరిద్వార్ లో నివసించే కొన్ని ముస్లిం కుటుంబాలు సోమవారం రాత్రి ఖవ్వాలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. దీనికోసం ముందుగా పోలీసుల అనుమతిని కూడా తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యిమంది వరకూ స్థానిక ముస్లింలు హాజరయ్యారు. ప్రేక్షకుల సంఖ్యను అంచనా వేయడంలో నిర్వాహకులు ఘోరంగా విఫలం అయ్యారు. వెయ్యిమందికి అనుగుణంగా ఏర్పాట్లను చేయలేకపోయారు. ముందుగా వచ్చిన వారికి ముందుగా.. అన్న చందంగా తయారైంది అక్కడి పరిస్థితి.
ఈ నేపథ్యంలో- ఆలస్యంగా వచ్చిన ప్రేక్షకులు వేదిక సమీపానికి దూసుకుని రావడానికి ప్రయత్నించారు. దీనితో వివాదం చెలరేగింది. కుర్చీలు అందుబాటులో లేవని, నిల్చునే చూడాలని ముందు వరుసల్లో కూర్చున్న వారు సూచించారు. దీనికి వారు అంగీకరించలేదు. వేదిక ముందుకు దూసుకుని రావడానికే ప్రయత్నించారు. ఫలితంగా ఇరు పక్షాల మధ్య వాగ్వివాదం చెలరేగింది. అది కాస్తా చిలికి, చిలికి గాలీవానగా మారింది.
పార్లమెంట్ భవనం వద్ద ప్రత్యక్షమైన ఇస్రో ఛైర్మన్ కే శివన్: అజిత్ ధోవల్ తో కలిసి.. !
మాటల యుద్ధం కాస్త ముదిరిపోవడంతో ఇక ప్రేక్షకులు గొడవకు దిగారు. ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు తోసుకున్నారు. చేతికి అందిన కుర్చీలను గాల్లోకి విసిరేశారు. మరి కొందరు వాటిని నేలకేసి విసిరి కొట్టారు. మరికొందరు కుర్చీలతో పరస్పరం దాడికి దిగారు. వారిని వారించడానికి ప్రయత్నించిన నిర్వాహకులపై కుర్చీలతో దాడికి దిగారు. కుర్చీలను విసురుతూ వెంటపడటం సీసీటీవీ కెమెరా ఫుటేజీల్లో రికార్డయ్యింది.
#WATCH People hurled chairs at one another at a Qawwali event in Haridwar last night, after a fight broke out reportedly over seating arrangements. No injuries reported. #Uttarakhand pic.twitter.com/OoOSMF2OhQ
— ANI (@ANI) November 19, 2019
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. దాడులకు పాల్పడిన వారిలో కొందరిని అరెస్టు చేశారు. మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీని మంగళవారం సాయంత్రం మీడియాకు విడుదల చేశారు. ప్రేక్షకులకు అనుగుణంగా ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఈ దాడి చోటు చేసుకుందని స్పష్టం చేశారు.