ఉల్లిపాయలకు దండేసి.. ప్రత్యేక పూజలు... కొండెక్కడంతో వినూత్న నిరసన...వందకు చేరువలో కేజీ...
ఉల్లిగడ్డ.. కన్నతల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందనే సామెత మనకు తెలుసు. వంటింటి అవసరంగా ఉల్లి మారిపోయింది. ప్రతీ వంటకు ఉల్లిగడ్డ తప్పనిసరి.. కానీ గత కొన్నిరోజులుగా ఉల్లి ధర కొండెక్కి కూర్చొంది. రూ.100కు కిలో చేరడంతో వినియోగదారులు ఉల్లిగడ్డ అనే పేరును తలచేందుకు కూడా భయపడుతున్నారు. అయితే బీహార్లో కొందరు వినూత్నరీతిలో నిరసన చేపట్టారు.
వినూత్న నిరసన..
బీహర్లోని ముజఫర్నగర్ వద్ద శనివారం హక్ ఏ హిందుస్థానీ మోర్చా సంస్థ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఒక బోర్డుకు ఉల్లిపాయలు పెట్టి, పూల దండ కూడా వేశారు. అగరొత్తి ముట్టించి పూజలు చేశారు. ఉల్లి ధర కొండెక్కడంతో ఇలా నిరసన చేపట్టామని సంస్థ ప్రతినిధులు మీడియాకు తెలిపారు.
కంట కన్నీరే..
ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు, మధ్యతరగతికి చెందిన వారు ఉల్లిగడ్డ కొనుగోలు చేయని పరిస్థితి లేదని సంస్థ ప్రతినిధి తమన్నా హస్మి పేర్కొన్నారు. అందుకోసమే నిరసన చపట్టామని వివరించారు. ఉల్లిగడ్డ కొనుగోలు చేయలేని సిచుయేషన్ ఉన్నందున ప్రార్థనలు చేసి వినూత్న నిరసనకు దిగామని పేర్కొన్నారు.
ఆలోచన వస్తుందా..?
తమ నిరసనతోనైనా ప్రభుత్వం ఉల్లి ధరలపై సమీక్షించాలని కోరారు. ధరలను తగ్గించేందుకు కృషిచేయాలని అభిప్రాయపడ్డారు. లేదంటే స్థానికుల నుంచి నిరసనలు ఎదురవుతాయని హెచ్చరించారు. ఉల్లి ధర కొండెక్కడంతో మధ్యతరగతి ప్రజలు ఉల్లిని కొనుగోలు చేయాలంటేనే వణికిపోతున్నారు.
మిగతా చోట్ల కూడా..
ఒక్క బీహరే కాదు మిగతా చోట్ల కూడా ఆందోళనలు మిన్నంటాయి. కేజీ ఉల్లి ధర రూ. వందకు చేరడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. యూపీలో ఆదివారం కొందరు ఆధార్ కార్డు తమ వద్ద పెట్టుకొని ఉల్లిగడ్డలు ఇచ్చిన ఘటన దుమారం రేపింది. వారణాసిలోని ఒక షాపులో ఈ ఘటన జరిగింది.
దిగుమతికి ఆదేశాలు..
మార్కెట్లో ఉల్లి ధర ఆకాశాన్ని అంటడంతో దిద్దుబాటు చర్యలకు కేంద్రప్రభుత్వం ఉపక్రమించింది. గతనెల 20వ తేదీన 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఆ ఉల్లిగడ్డలు దేశానికి వచ్చాక సమస్య తీరే అవకాశం ఉంది. అప్పటివరకు ఉల్లి సామాన్యులకు అందనిద్రాక్షగా ఉండనుంది.