కొన్ని నిర్ణయాలకు దమ్ము ధైర్యం ఉండాలి..అది మాకు టన్నుల్లో ఉంది: అమిత్ షా
Recommended Video
న్యూఢిల్లీ: సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులతో ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అదే సమయంలో భారత్ అంటే ఏమిటో ప్రపంచదేశాలకు తెలిసి వచ్చిందని అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా . ఇలాంటి దాడులు చేసేందుకు ఎంతో ధైర్యం ఉండాలని అది మోడీ నాయకత్వంలో జరిగిందని చెప్పారు. ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్లో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. యూపీఏ ప్రభుత్వంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలు కనీసం ఐదైనా చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వాలు దేశంలో 30 ఏళ్లు అధికారంలో ఉన్నాయని వారి హయాంలో తీసుకున్న ఐదు అతిపెద్ద నిర్ణయాలు చెప్పాలని సవాల్ చేశారు. ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే దానికి ఎంతో ధైర్యం సాహసం కావాలని అమిత్ షా పేర్కొన్నారు. పాకిస్తాన్పై సర్జికల్ దాడులు చేయడం, జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం తమ ప్రభుత్వ అతి పెద్ద విజయాలుగా చెప్పుకొచ్చారు అమిత్ షా. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదని చెప్పిన అమిత్ షా... తమ నిర్ణయాలతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ఒక్క అంగుళం భూమి కూడా శతృదేశానికి వెళ్లడం తాము సహించబోమని చెప్పిన కేంద్రహోంశాఖ మంత్రి... సర్జికల్ స్ట్రైక్స్తో ప్రపంచ దేశాలు భారత్ వైపు దృష్టి సారించాయని చెప్పారు. అప్పటివరకు మనకు అంతర్గత భద్రతా విధానమంటూ ఒకటి లేదని చెప్పిన షా... రక్షణ విధానాలు లేవన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన మొదట్లో అంతా బూటకమని అన్నారని అయితే వైమానిక దాడులు తర్వాతే వారికి నిజం తెలిసొచ్చిందని చెప్పారు. ఒక్క జవాను మరణించిన అది దేశానికి పెద్ద లోటని అభిప్రాయపడ్డారు అమిత్ షా.
ఆర్టికల్ 370 రద్దు ఎలా జరుగుతుందని చాలామంది ప్రశ్నించారని అయితే ఆగష్టు 5న ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కశ్మీర్లో ఒక్క తూటా పేలిన వార్తలు రాలేదని చెప్పారు.