ప్రజలు మాపై కోపంతో ఉన్నారు: ఓటమిపై సిసోడియా, యెడ్డీ ఇలా
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. రాజౌరి గార్డెన్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి 14,500 మెజార్టీతో గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాలు గెలిచింది. బీజేపీ మూడింట మాత్రమే గెలిచింది.
ఇప్పుడు కేజ్రీవాల్ పార్టీకి షాక్ తగిలింది. దీనిపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆసక్తికరంగా స్పందించారు. ఈ నియోజకవర్గంలో తమ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ పంజాబ్కు వెళ్లడం వల్లే ఓడిపోయామని పేర్కొన్నారు.
జర్నైల్ సింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల ఇక్కడి ఓటర్లు ఆగ్రహంతో ఉన్నారని, అందుకే ఇలా జరిగిందన్నారు. జర్నైల్ సింగ్ ఇటీవల పంజాబ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ ఓడిపోయారు.
నియోజకవర్గ ప్రజలను తాము గమనిస్తున్నామని, వారు జర్నాలీపై కోపంగా ఉన్నారని సిసోడియా తెలిపారు. ఈ విషయంపై ప్రజలకు తమ పరిస్థితి గురించి చెప్పే ప్రయత్నం చేశామని, కానీ అది ఫలించలేదన్నారు. భవిష్యత్తు ఎన్నికల కోసం కృషి చేస్తామన్నారు.
కాగా, త్వరలో ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున ఇక్కడ బీజేపీ గెలుపు చర్చనీయాంశంగా మారింది. అయితే ఉప ఎన్నికల ఫలితాలు మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం చూపబోవని, వాటిలో ఏఏపీ తప్పకుండా గెలుస్తుందని మనీష్ సిసోడియా విశ్వాసం వ్యక్తం చేశారు.
కర్నాటకలో బీజేపీ ఓటమిపై యెడ్యూరప్ప
ఉప ఎన్నికల్లో ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తామని కర్ణాటక బీజేపీ అధ్యక్షులు యడ్యూరప్ప తెలిపారు. కర్ణాటకలోని గుండ్లుపేట, నాంజన్గుడ్లలో నిర్వహించిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.
గుండ్లుపేట స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి గీతా మహాదేవప్రసాద్ విజయం సాధించారు. నాంజన్గుడ్ ప్రాంతం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కాలే ఎన్ కేశవమూర్తి గెలుపొందారు.
కర్ణాటక మంత్రి మహాదేవప్రసాద్ మృతి చెందడంతో గుండ్లుపేట స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. అక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి సీఎస్ నిరంజన్ కుమార్పై దివంగత మంత్రి భార్య గీతా మహాదేవ ప్రసాద్ పోటీ చేసి విజయం సాధించారు. వరుస ఓటములతో ఉన్న కాంగ్రెస్కు ఈ ఉపఎన్నిక ఫలితాలు కొంత ఊరటనిచ్చాయి.
కాగా, ఎనిమిది రాష్ట్రాల్లోని పది నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల్లో బీజేపీ విజయ పరంపర కనిపించింది. ఢిల్లీ, హిమాచల్, అసోం, మధ్యప్రదేశ్లలో విజయకేతనం ఎగురవేసింది.
ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో 14,500 ఓట్ల మెజార్జీతో బీజేపీ అభ్యర్థి మన్జిందర్ సింగ్ సిర్సా గెలుపొందారు. గతంలో ఈ స్థానంలో భారీ మెజార్టీతో గెలుపొందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. రాజౌరీ గార్డెన్ సిట్టింగ్ ఆప్ ఎమ్మెల్యే జర్నాలీ సింగ్ పదవిని వదిలి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. జర్నాలీ సింగ్ రాజీనామాతో రాజౌరీ గార్డెన్ స్థానంలో ఉప ఎన్నిక జరిగింది.
అసోంలోని ధిమాజీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రనోజ్ పెగు 9,285 ఓట్ల మెజార్జీతో గెలుపొందారు. * మధ్యప్రదేశ్లోని బాంధవ్గఢ్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి శివనారాయణ్ సింగ్ విజయం సాధించారు.
హిమాచల్ప్రదేశ్ భోరంజ్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. కర్ణాటకలోని రెండు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. గుండ్లుపేట అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గీతా మహాదేవప్రసాద్ విజయం సాధించారు. నంజన్గుడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కాలే ఎన్ కేశవమూర్తి 21334 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
పశ్చిమ బెంగాల్లోని కంతి దక్షిన్ నియోజకవర్గంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. పార్టీ అభ్యర్థి చంద్రిమా భట్టాచార్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజస్థాన్లోని ధోలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శోభా రాణి గెలుపొందారు.