ఎన్ఎస్జీ అంటే అసాంఘిక శక్తులకు వణుకు: అమిత్ షా, ‘సైనికులు ఇక ఫ్యామిలీస్తో 100 రోజులు’
కోల్కతా: దేశాన్ని విభజించి శాంతిని అడ్డుకునే వారి వెన్నులో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) దళాలు వణుకు పుట్టించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అసాంఘిక శక్తులతో పోరాడి వాటిని అంతమొందించే బాధ్యత ఎన్ఎస్జీదేనని అన్నారు. కోల్కతాలో సమీపంలోని రాజార్హాట్లో ఎన్ఎస్జీ నూతన కాంప్లెక్స్ను అమిత్ షా ఆదివారం ప్రారంభించారు.
ఎన్ఎస్జీ భవనాల ప్రారంభం..
ఈ సందర్భంగా మానేసర్, హైదరాబాద్, చెన్నై, ముంబైలోని ఎన్ఎస్జీ భవనాలను కూడా కోల్కతా నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమిత్ షా ప్రారంభించారు. ఎన్ఎస్జీని మరింత బలోపేతం చేసేందుకు కావాల్సిన అన్ని వసతుల్ని రానున్న ఐదేళ్లలో కల్పిస్తామని హామి ఇచ్చారు.
సైనికులు వారి ఫ్యామిలీలతో 100 రోజులు..
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దళాల్లో ఎన్ఎస్జీని నిలిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఏడాదిలో 100 రోజులు సైనికులు వారి కుటుంబంతో కలిసి ఉండేలా ఓ విధానాన్ని తీసుకురావాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని అమిత్ షా చెప్పారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు.
ఆ దేశాల సరసన భారత్..
సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత ఆ సత్తా కలిగిన అమెరికా, ఇజ్రాయెల్ సరసన భారత్ చేరిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. సైనికులపై దాడికి ప్రతీకారంగా శత్రుభూభాగంలోకి చొచ్చుకువెళ్లి దాడి చేయగల సామర్థ్యం ఉందని నిరూపించామన్నారు. యావత్ ప్రపంచంలో శాంతిని కోరుకునే దేశం భారత్ అని, ఇప్పటి వరకూ ఏ ఒక్క దేశంపైనా దాడి చేయలేదని గుర్తు చేశారు.
పశ్చిమబెంగాల్లో బీజేపీదే అధికారం..
వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టబోతోందని అమిత్ షా జోస్యం చెప్పారు. కాగా, ఏప్రిల్ జరిగే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అమిత్ షా శ్రీకారం చుట్టేందుకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు అమిత్ షా పశ్చిమబెంగాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో టీఎంసీతోపాటు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు. గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.