నాకు ఏం జరిగినా ప్రజలు ప్రధానినే నిలదీస్తారు: అన్నాహజారే హెచ్చరిక
రాలేగావ్: తనకు ఏదైనా జరిగితే అందుకు బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీదే అవుతుందని ప్రముఖ సామాజికవేత్త అన్నాహజారే పరోక్షంగా హెచ్చరించారు. లోకాయుక్త, లోక్పాల్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్సిద్ధిలో నిరాహార దీక్ష చేస్తున్నారు.
ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతికి వ్యతిరేక పోరాటంలో తనకు ఏం జరిగినా ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీనే నిలదీస్తారని హెచ్చరించారు. లోక్పాల్, లోకాయుక్తల నియామకాల్లో జాప్యాన్ని నిరసిస్తూ గత బుధవారం రాలేగావ్సిద్ధిలో నిరాహార దీక్షు ప్రారంభించారు.
దేశంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా ప్రజలు తనను గుర్తుంచుకుంటారని, కానీ అగ్నికి ఆజ్యం పోసిన నేతగా కాదని చెప్పారు. తనకు ఏం జరిగినా మోడీనే నిలదీస్తారన్నారు. లోక్పాల్, లోకాయుక్తను నియమిస్తే ప్రధాని, ముఖ్యమంత్రిని సైతం విచారించవచ్చునని చెప్పారు. అందువల్లే పార్టీలు ఈ వ్యవస్థను అమలులోకి తీసుకురావడానికి వెనకాడుతున్నాయన్నారు.
అన్నాహజారే దీక్ష పట్ల ప్రధానమంత్రి సరిగా స్పందించడం లేదని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన పలువురు శనివారం గ్రామంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కొంతమంది యువకులు, మహిళలు స్థానికంగా ఉన్న ఓ టవరెక్కి నిరసన తెలిపారు.
ఈ నిరాహార దీక్ష విషయమై అన్నాహజారే జనవరి ఒకటో తేదీన ప్రధానికి లేఖ రాశారని తెలిపారు. స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం కేవలం ధన్యవాదాలు, శుభాకాంక్షలు మాత్రమే తెలిపిందన్నారు. ఇది అన్నాహజారే దీక్షను అవమానించడమే అన్నారు.