ఎన్నికల చరిత్రలో మొదటిసారి! ఓటు వేసిన మానసిక వికలాంగులు! ఒకరో, ఇద్దరో కాదు..వందమందికి పైగా!
చెన్నై: దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ సందర్భంగా తమిళనాడులో కొనసాగుతున్న పోలింగ్ లో చారిత్రత్మక ఘటన చోటు చేసుకుంది. మానసిక వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడం దేశ ఎన్నికల చరిత్రలో ఇదే తొలిసారి.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం.. పంచాయతీ మొదలుకుని లోక్ సభ వరకు నిర్వహించిన ఏ ఎన్నికలోనూ మానసిక వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. దాన్ని తిరగరాసింది తమిళనాడు. మొదటిసారి మానసిక వికలాంగులు ఓటు వేయడానికి అనుమతి ఇచ్చింది. దీనితో 159 మంది మానసిక రోగులు ఓటు వేశారు.
పెళ్లి పీటల మీది నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి..!
చెన్నైలోని కీల్పాక్ ప్రాంతంలో ఉన్న ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఆసుపత్రిలో సుమారు 500 మందికి పైగా మానసిక వికలాంగులు చికిత్స పొందుతున్నారు. వారిలో చాలామందికి ఓటు హక్కు ఉంది. వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పించాలని కోరుతూ ఆసుపత్రి అధికారులు.. ఎన్నికల కమిషన్ కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. దీన్ని పరిశీలించిన అనంతరం ఎన్నికల కమిషన్ వారికి అనుమతి ఇచ్చింది.
దీనితో రెండు నెలల కిందట ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించారు ఆసుపత్రి అధికారులు. చికిత్స కోసం వివిధ తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి కీల్పాక్ ఆసుపత్రికి వచ్చిన రోగుల వివరాలను తీసుకున్నారు. ఓటరు జాబితాలో వారి పేర్లను చేర్చారు. 192 మంది పేర్లను వారు ఓటరు జాబితాలో చేర్చగలిగారు. ఈ 192 మందిలో 114 మంది పురుషులు, 78 మంది మహిళలు ఉన్నారు. వారిలో 159 మంది మానసిక వికలాంగులు గురువారం తొలిదశ పోలింగ్ సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నై సెంట్రల్ లోక్ సభ పరిధిలో వారు ఓటు వేశారు.