అంబానీలను మించాడు.. పిట్టల దొర కాదు, ఎమ్మెల్యే అభ్యర్థి..! లక్షల కోట్ల ఆస్తులు, అప్పులు
పెరంబూర్ : నా దగ్గర కోట్లున్నాయి. దేశంలో బడా నేతలకు, వ్యాపారుల అవసరాలకు అప్పిచ్చేది నేనే. ఐదారు కార్లున్నా.. ఆరోగ్యం కోసం కాలినడకన వెళుతున్నా. మోడీతో బ్రేక్ ఫాస్ట్, చంద్రబాబుతో లంచ్, కేసీఆర్ తో డిన్నర్.. ఇది నా రొటీన్ లైఫ్. అసలు ఇదంతా ఏంటనుకుంటున్నారా? సాధారణంగా గ్రామాల్లో కనిపించే పిట్టల దొర వాలకం. కాస్తా అటు ఇటైనా.. తమిళనాడు ఎన్నికల్లో అలాంటి సీనే కనిపించింది. ఎమ్మెల్యే బై ఎలక్షన్లల్లో లక్షల కోట్ల ఆస్తులు, అప్పులు ఉన్నాయంటూ.. ఓ అభ్యర్థి అఫిడవిట్ సమర్పించడం చర్చానీయాంశమైంది.
అపర కుబేరుడంట..!
తమిళనాడులోని పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరగనున్నాయి. అయితే జెబామణి జనతా పార్టీ అభ్యర్థిగా జె.మోహన్ రాజ్ అనే 67 ఏళ్ల పెద్దాయన వేసిన నామినేషన్ హాట్ టాపికయింది. తన దగ్గర లక్షా 76 వేల కోట్ల రూపాయల నగదు ఉన్నట్లు నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్ సమర్పించారు. ఆయన దగ్గర మాత్రం కోట్లల్లో నగదు ఉన్నట్లు పేర్కొన్న ఈ పెద్దాయన తన భార్య దగ్గర మాత్రం కేవలం 20 వేల రూపాయల క్యాష్ ఉన్నట్లు రాశారు. గత నెల 26వ తేదీన నామినేషన్ దాఖలు చేసినప్పటికీ.. కాస్తా ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది.
పారదర్శకమా? పబ్లిక్ స్టంటా?
ఆస్తుల గురించి అలా ఉంటే.. అప్పుల గురించి ప్రస్తావించిన విషయం మరీ విచిత్రంగా ఉంది. చిన్న చితకా బ్యాంకులకు కాదు.. ఈ పెద్దాయన ఏకంగా వరల్డ్ బ్యాంకుకే 4 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆమె భార్య దగ్గర రెండున్నర లక్షల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు ఉన్నట్లు అందులో రాశారు. ఒక కేసు కూడా తనపై ఫైల్ అయినట్లు మెన్షన్ చేశారు. 20 రూపాయల బాండ్ పేపర్ పై రాసిచ్చిన ఈ అఫిడవిట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పబ్లిసిటీ స్టంట్ కోసమే మోహన్ రాజ్ ఇలా చేసి ఉంటారనే వాదనలు లేకపోలేదు. అంబానీలను మించిన ఈ అపర కుబేర ఎమ్మెల్యే అభ్యర్థి ఆస్తులు, అప్పులు చర్చానీయాంశంగా మారాయి.
2002-03 చివరి రిటర్న్.. మరి ఈ లెక్కలేంటో?
ఈ లక్షల కోట్ల కుబేరుడు చివరిసారిగా ఐటీ రిటర్న్స్ ఎప్పుడు వేశారో తెలిస్తే మరింత షాక్ కు గురికావాల్సిందే. 2002-03 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసిన మోహన్ రాజ్ ఇంతవరకు ఎలాంటి రిటర్న్స్ వేయకపోవడం గమనార్హం. మరి ఇన్ని కోట్ల ఆస్తులుండి ప్రతి సంవత్సరం ఐటీ రిటర్స్న్ దాఖలు చేయకుంటే ఆ శాఖ అధికారులు ఊరుకుంటారా.
లక్షా 76 వేల కోట్ల రూపాయల నగదు ఉందని పేర్కొన్న ఈ పెద్దాయన పేరిట బ్యాంకుల్లో ఏమీ లేవట. బాండ్స్, డిపాజిట్లు, డిబేంచర్లు, షేర్లు.. ఏమీ లేవని పేర్కొన్నారు. ఎల్ఐసీ పాలసీలు, పోస్టల్ సేవింగ్స్ కూడా శూన్యమే. కనీసం లక్ష రూపాయలు కూడా పర్సనల్ లోన్ గానీ హోమ్ లోన్ గానీ ఏదీ లేని మోహన్ రాజ్.. ఏకంగా వరల్డ్ బ్యాంక్ నుంచి 4 లక్షల కోట్ల రుణం తీసుకున్నాడని అఫిడవిట్ లో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది.
ఆ లోగుట్టు ఆయనకే ఎరుక
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే పిట్టల దొరలు మాటలు నవ్వులు పూయిస్తాయి. అలా నాలుగు మాటలు చెప్పి పొట్టపోసుకోవడం వారి జీవన గమనం. కానీ ఈ స్టోరీలోని పెద్దాయన అక్షర రూపంలో పెట్టి నవ్వించాలనుకున్నాడో, ప్రత్యర్థులను కవ్వించాలనుకున్నాడో ఏమో గానీ.. ఆ లోగుట్టు మాత్రం ఆయనకే ఎరుక. అదలావుంటే వరల్డ్ బ్యాంక్ లోన్ పొందడం అంతా ఈజీయా?.. అప్లికేషన్లు ఎక్కడ దొరుకుతాయంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.