సిద్దరామయ్య, ఆజాద్ విమానానికి అనుమతి నిరాకరణ, గంటకు పైగా ఫ్లైట్లోనే
బెంగుళూరు:కర్ణాటక నుండి హైద్రాబాద్ కు ప్రత్యేక విమానంలో రావాల్సిన కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు హైద్రాబాద్ కు తరలివచ్చేందుకు ఏర్పాటు చేసుకొన్న విమానానికి కర్ణాటక విమానాశ్రయంలో గంటపాటు అనుమతిని నిలిపివేశారు. అయితే చివరకు అనుమతి లభించడంతో ఆ విమానంలోనే సిద్దరామయ్య, ఆజాద్ హైద్రాబాద్ కు చేరుకొన్నారు.
కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలు కేరళలోని రిసార్ట్స్ కు వెళ్ళాల్సి ఉన్న సమయంలో కూడ రెండు ప్రత్యేక విమానాలకు మే 17వ తేది రాత్రి అనుమతి లభించలేదు. దీంతో ఈ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు శర్మ ట్రావెల్స్ బస్సుల్లో హైద్రాబాద్ కు వచ్చారు.
అయితే హైద్రాబాద్ లో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి సిద్దరామయ్య,.ఆజాద్ వచ్చేందుకు ప్రత్యేక విమానంలో కూర్చొన్న గంటసేపటి వరకు కూడ టేకాఫ్ అయ్యేందుకు డిజీసీఏ నుండి అనుమతి లభించలేదు. సుమారు గంటకు పైగా విమానంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు కూర్చొన్నారు. దీంతో ఆలస్యంగా సిద్దరామయ్య, ఆజాద్ హైద్రాబాద్ కు వచ్చారు.
మే 17వ తేది రాత్రి కూడ కెంపెగౌడ విమానాశ్రయంలో ఇలానే జరిగింది. ప్రత్యేక విమానాల్లో ఎమ్మెల్యేలను కేరళలో తరలించాలనుకొన్నా డీజీసీఏ నుండి అనుమతి లభించని కారణంగా బస్సుల్లో ఎమ్మెల్యేలు బస్సుల్లో హైదరాబాద్కు వచ్చారు .
మే 19వ తేదిన జరిగే బల పరీక్షలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ సమావేశంలో కాంగ్రెస్, జెడి(ఎస్) నేతలు వ్యూహరచన చేస్తున్నారు. విశ్వాస పరీక్షల్లో బిజెపి అనుసరించే విధానాలను చిత్తు చేసి విజయం సాధించాలని ఈ కూటమి భావిస్తోంది. అయితే ఏం జరుగుతోందో కొన్ని గంటల్లో తేలనున్నాయి.