అయోధ్య కేసులో సరికొత్త ట్విస్ట్: ఆ భూమిని యజమానులకు ఇస్తామని సుప్రీం కోర్టుకు కేంద్రం
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదంలో మరో కొత్త ట్విస్ట్. అయోధ్యలోని రామ జన్మభూమి చుట్టూ సేకరించిన 67 ఎకరాల భూమిని తిరిగి ఆయా యజమానులకు ఇచ్చేందుకు అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయోధ్యలో మొత్తం 2.77 ఎకరాల భూమిపై వివాదం కోర్టులో నడుస్తోంది.
ప్రభుత్వం దాని చుట్టూ ఉన్న 67 ఎకరాల భూమిని ఆయా యజమానుల నుంచి సేకరించింది. ఈ భూమి వివాదంలో లేదు. ఇప్పుడు దానిని ఆయా యజమానులకు తిరిగి ఇచ్చేస్తామని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ఈ 67 ఎకరాల భూమిని ప్రభుత్వం 1991లో సేకరించింది. ఈ మేరకు పిటిషన్లో పేర్కొంది.
ఇప్పుడు ఆ భూమిని తిరిగి యజమానులకు ఇచ్చేయాలని రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటైన రామ జన్మభూమి న్యాస్ కోరుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తన పిటిషన్లో వెల్లడించింది. గతంలో ఈ అంశంపై కోర్టు స్పందిస్తూ ఆ 67 ఎకరాల విషయంలోనూ ఇప్పుడున్న పరిస్థితినే కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే మరోసారి ఆ తీర్పును సమీక్షించాలని ఇప్పుడు కేంద్రం కోరుతోంది.
అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా చేసి.. సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్ లల్లాకు పంచుతూ తొమ్మిదేళ్ల క్రితం అంటే 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో దాదాపు 14 పిటిషన్లు దాఖలయ్యాయి.