వేడుకలు రద్దు! వారి త్యాగాలు వృధా కానివ్వం: మోడీ! మావోల దాడి బాధాకరం: రాహుల్!
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు పోలీసుల వాహనాన్ని పేల్చి వేసిన ఘటనలో 16 మంది దుర్మరణం పాలైన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అమర వీరుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. మావోయిస్టుల దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ దాడికి ప్రతీకారాన్ని తీర్చుకుంటామని అన్నారు. మహారాష్ట్ర దినోత్సవ వేడుకలను గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు రద్దు చేశారు.
వారి త్యాగాలను వృధా కానివ్వం: మోడీ
గడ్చిరోలి జిల్లాలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న మావోయిస్టుల దాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. అత్యంత బాధాకరమైన ఘటనగా అభివర్ణించారు. ప్రత్యేక పోలీసు బలగాల త్యాగాలను వృధా కానివ్వబోమని అన్నారు. మానవ సమాజంలో ఇలాంటి దాడులకు తావు లేదని, ప్రాణ హననానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టేది లేదని మోడీ స్పష్టం చేశారు.
దాడి బాధాకరం: రాహుల్ గాంధీ
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల దాడి పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అమర వీరులైన పోలీసుల కుటుంబానికి ఆయన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. హింసను విడనాడాలని పిలుపునిచ్చారు. దాడులు, ప్రతిదాడులను ఏ ఒక్కరూ ప్రోత్సహించబోరని చెప్పారు.
పిరికిపందల చర్య: రాజ్ నాథ్ సింగ్
గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల దాడిని కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాజ్ నాథ్ సింగ్ పిరికిపంద చర్యగా అభివర్ణంచారు. శాంతియుత పరిస్థితులను నెలకొల్పడంలో భాగంగా.. విధి నిర్వహణలో ఉంటూ మావోయిస్టుల దాడికి గురైన పోలీసులను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు. ప్రాణాలను సైతం ఎదురొడ్డి నిలిచారని అన్నారు. వారి త్యాగాలను వృధా కానివ్వబోమని, బదులు తీర్చుకుంటామని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
రాజ్ భవన్ లో వేడుకలు రద్దు..
మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు రద్దు చేశారు. గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల దాడిని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 59వ మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం సాయంత్రం రాజ్ భవన్ లో నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదే సమయంలో- మావోయిస్టుల దాడిలో 16 మంది పోలీసులు అమరులు కావడంతో.. ఈ వేడుకలను రద్దు చేసినట్లు రాజ్ భవన్ అధికార వర్గాలు వెల్లడించాయి.