మధ్య తరగతికి త్వరలో శుభవార్త: హింట్ ఇచ్చిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదాయపు పన్ను హేతుబద్ధీకరణ కూడా అందులో ఒకటిగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. శనివారం 'హిందూస్థాన్ టైమ్స్' లీడర్ షిప్ సమ్మిట్లో పాల్గొన్న ఆమె ఈ మేరకు స్పందించారు.
కాదని చెప్పనంటూ..
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని నిర్మలా సీతారామన్ వివరించారు. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే మరిన్ని చర్యలు చేపడతారా? అని ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ఒకవేళ తాను ఇప్పుడే అవునని చెబితే.. ఎప్పుడు అని అడుతారని.. అలాగని తాను కాదు అని కూడా చెప్పను అని అన్నారు.
వ్యక్తిగత ఆదాయపు పన్నుపై..
ఎందుకంటే తాము మరిన్ని చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆ దిశగా పనిచేస్తున్నామని నిర్మలా సీతారామాన్ స్పష్టం చేశారు. ప్రజలపై పన్ను భారం తగ్గిస్తూ వ్యక్తిగత ఆదాయపు పన్ను హేతుబద్ధీకరిస్తారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాము పరిశీలిస్తున్న అంశాల్లో అదీ కూడా ఒకటి అని ఆమె చెప్పారు.
త్వరలోనే మధ్యతరగతికి శుభవార్త..
జీఎస్టీ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. రేట్ల విధానంపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పన్ను రేట్లను హేతుబద్ధీకరించి పన్ను వ్యవస్థను సరళీకరిస్తామని నిర్మలా సీతారామన్ వివరించారు. కార్పొరేట్ పన్నును సెప్టెంబర్ నెలలో తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత ఆదాయం పన్ను కూడా తగ్గించాలనే డిమాండ్లు వచ్చాయి. కాగా, నిర్మలా సీతారామన్ ఈ విషయంపై చెప్పిన సమాధానం పరిశీలిస్తే.. త్వరలోనే మధ్యతరగతికి కొంత ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.