వారే కాశీలో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు: జైట్లీ
న్యూఢిల్లీ: అవార్డులు వెనక్కి ఇవ్వడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం తీవ్రస్థాయిలో స్పందించారు. బిజెపి వ్యతిరేకులే అవార్డులను వెనక్కి ఇస్తున్నారని చెప్పారు. బిజెపి అధికారంలోకి వచ్చాక జరుగుతున్న పలు ఘటనలను నిరసిస్తూ సాహితీవేత్తలు అవార్డులు వెనక్కి ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా, ప్రముఖ శాస్త్రవేత్త భార్గవ తన పద్మభూషణ్ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై జైట్లీ పాట్నాలో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ పురస్కారాలు ఇచ్చేస్తున్న వారంతా బీజేపీ వ్యతిరేకులన్నారు.
వారిలో కొందరు లోకసభ ఎన్నికల ముందు ప్రధాని మోడీ పోటీ చేసిన వారణాసి నియోజకవర్గంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారని చెప్పారు. మతవిద్వేషాలు పెరిగిపోతున్నాయని సాహితీవేత్తలు చేస్తున్న ఆరోపణలు సరైనవి కాదన్నారు.'
బీహార్ ఎన్నికల్లో బిజెపిని పరోక్షంగా దెబ్బతీయడం కోసం ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు. పురస్కారాలను తిరస్కరిస్తున్న వారు ఇతర మార్గాల ద్వారా రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయ అంశాలపా సామాజిక మాధ్యమాల్లో వారు చేస్తున్న వ్యాఖ్యలు చూడవచ్చన్నారు.
వారు బిజెపిని ఎంతగా వ్యతిరేస్తున్నారో ఇట్టే అర్థమవుతుందన్నారు. ఇదంతా కృత్రిమ నిరసన అని తాను ఇదివరకే చెప్పానని, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం కోసం ఆయన పోటీ చేసిన వారణాసికి ఇందులో కొందరు వెళ్లారన్నారు.
ఇది రాజకీయ కుట్ర అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో మతపరమైన అల్లర్లు జరిగినప్పుడు వీరంతా ఏం చేశారని నిలదీశారు. నిరసనలు తెలియజేయడానికి పురస్కారాలను వాపస్ ఇవ్వడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. శాంతిభద్రతల అంశం రాష్ట్రాలకు సంబంధించిన అంశమన్నారు.
పలువురు అవార్డులు వెనక్కి ఇవ్వడంపై రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) కూడా తీవ్రంగా స్పందించింది. గోద్రా అల్లర్లు జరిగినప్పుడు, కాశ్మీర్ పండిట్ల ఊచకోత, సిక్కుల ఊచకోత సమయంలో వీరంతా ఎక్కడున్నారని ఆరెస్సెస్ ప్రశ్నించింది.