మారెమ్మ ఆలయ ప్రసాదంలో విషం...నిందితులను ప్రశ్నిస్తున్న పోలీసులు
కర్నాటకలో ఓ ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన భక్తులు ప్రసాదం సేవించడంతో 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇందులో విషం కలిసి ఉండొచ్చనే అనుమానం ప్రాథమికంగా వ్యక్తం చేశారు చామరాజనగర్ జిల్లా వైద్యాధికారులు. కిచు మారమ్మ ఆలయం ప్రారంభోత్సవానికి వచ్చిన భక్తులు ప్రసాదం తీసుకున్నారు. ఆ ప్రసాదంలో పురుగుల మందు కలిసిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రసాదంగా వారికి టమాటా రైస్ వడ్డించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అంతేకాదు ప్రసాదం తిన్న చాలా కాకులు కూడా అక్కడ చనిపోయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు మరో ఐదు మందికోసం గాలిస్తున్నారు.
కర్నాటకలో విషాదం: ఆలయంలో ప్రసాదం సేవించి 12 మంది మృతి
ఇంఛార్జ్ మంత్రి పుట్టరంగ శెట్టి
రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ వల్లే ఒక వర్గంవారు ప్రసాదంలో విషం కలిపి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు చామరాజ్నగర్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి పుట్టరంగ శెట్టి. దోషులు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారని గుర్తు చేశారు మంత్రి . భక్తులు ప్రసాదం స్వీకరించిన వెంటనే వాంతులు, విరేచనాలు అయ్యాయి.
వెంటిలేటర్ పై చికిత్స
అంతేకాదు శ్వాస సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయని చెప్పారు మంత్రి పుట్టరంగ శెట్టి. వారందరికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. చాలామందికి వెంటిలేటర్ పై చికిత్స అందించాల్సి ఉండటంతో అంతమందికి సరిపడా వెంటిలేటర్లు లేవని చెప్పారు. దీంతో బాధితులను ఇతర ప్రైవేటు ఆస్పత్రులకు కూడా తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
పురుగుల మందు కలిపారని
ఇప్పటికి 47 మంది బాధితులను చికిత్స కోసం కేర్ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. 17 మంది మైసూరులో జేఎస్ఎస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. మొత్తానికి 91 మంది పేషంట్లను చామరాజనగర్ ఆస్పత్రి నుంచి మైసూరుకు షిఫ్ట్ చేయడం జరిగిందన్నారు మంత్రి. ఆలయ ప్రారంభం సందర్భంగా భక్తులకు ఇచ్చిన ప్రసాదంలో పురుగుల మందు కలిపారని పోలీసులు చెప్పారు. అయితే పురుగుల మందు ఆలయంలోకి ఎలా ప్రవేశించదన్న దానిపై విచారణ జరుగుతోందని పోలీసులు చెప్పారు.