హార్ట్ టచింగ్ : యజమాని కోసం శునకం ప్రాణ త్యాగం...
పెంపుడు శునకాలు యజమానుల పట్ల ఎంత ప్రేమతో,విశ్వాసంతో ఉంటాయో అందరికీ తెలిసిందే. అవసరమైతే యజమాని ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డు వేస్తాయి. తాజాగా కేరళలో అప్పు అనే ఓ శునకం యజమాని ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను త్యాగం చేసింది.
వివరాల్లోకి వెళ్తే... కేరళలోని కొట్టాయం జిల్లా చమంపతల్ గ్రామానికి చెందిన అజేష్ అనే వ్యక్తి ఓ శునకాన్ని పెంచుకుంటున్నాడు. దానికి ముద్దుగా అప్పు అనే పేరు పెట్టాడు. గత బుధవారం(సెప్టెంబర్ 9) ఉదయం అజేష్ తన ఐదేళ్ల కుమారుడితో కలిసి స్థానికంగా ఉన్న షాపులో మిల్క్ తీసుకొచ్చేందుకు వెళ్లాడు. ఇటీవల అజేష్ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో నెమ్మదిగా నడుస్తూ ముందుకు సాగాడు.
ఈ క్రమంలో అజేష్ కంటే ముందు పరుగులు పెట్టిన శునకం... మార్గమధ్యలో ఓ చోట ఎలక్ట్రిక్ వైర్ తెగి పడి ఉండటాన్ని గమనించింది. తన యజమాని వైర్ను ఎక్కడ తొక్కుతాడోనని... దాన్ని నోట కరిచి పక్కకు పడేసే ప్రయత్నం చేసింది. కానీ ఆ వైర్కు విద్యుత్ ప్రవాహం ఉండటంతో ఆ శునకం అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో రెండేళ్లుగా అప్పును తమ కుటుంబ సభ్యుడిగా పెంచుకుంటున్న అజేష్ షాక్కి గురయ్యాడు. విషన్నవదనాల నడుమ అజేష్ కుటుంబం ఆ శునకానికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ వార్త సోషల్ మీడియాలోకి ఎక్కడంతో చాలామంది జంతు ప్రేమికులు ఆ శునకం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. యజమాని ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలను త్యాగం చేసిన ఆ శునకంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది నిపుణులు మాట్లాడుతూ.... తల్లిదండ్రులకు వారి పిల్లలకు ఎలాంటి బంధమైతే ఉంటుందో... శునకాలకు వాటి యజమానులకు అలాంటి బంధమే ఉంటుందని చెబుతున్నారు.
ఇటీవల చైనాలో ఓ శునకం కరోనాతో చనిపోయిన తన యజమాని కోసం ప్రతీరోజూ ఆస్పత్రికి వెళ్లి అతని రాక కోసం నిరీక్షించిన సంగతి తెలిసిందే. అతను మరణించాడన్న విషయం తెలియక... తిరిగి వస్తాడేమోనన్న ఆశతో ఆ శునకం రోజూ ఆస్పత్రికి వెళ్లేది. ఆ శునకం బాధ చూడలేక ఆస్పత్రి సిబ్బంది దాన్ని వేరే ప్రాంతంలో విడిచి వచ్చినా సరే... తిరిగి అక్కడికే చేరుకునేది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది ఆ శునకంపై సానుభూతి వ్యక్తం చేశారు. సొంత మనుషుల్లోనే విశ్వాసం కరువవుతున్న ఈరోజుల్లో ఇలాంటి శునకాల గురించి చదివి చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.