భార్య కుటిలత్వానికి బలయ్యా: పీటర్ ఆవేదన
ముంబై: తన భార్య ఇంద్రాణి కుటిల పద్ధతలకు తాను బాధితుడిని అయ్యానని మీడియా దిగ్గజం పీటర్ ముఖార్జియా ఆవేదిన చెందుతుండేవాడట. ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది మిహిర్ ఘీవాలా కోర్టులో వాదనలు వినిపిస్తూ చెప్పారు. తన భార్య కుటిల పద్ధతులకు తాను బాధితుడిని అయ్యానని పీటర్ ముఖార్జియా ఎప్పుడూ చెప్తూ ఉండేవారని కోర్టుకు చెప్పారు.
షీనా బోరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పీటర్ ముఖర్జియా సీబీఐ కస్టడీని ప్రత్యేక కోర్టు ఈ నెల 30 వరకు పొడిగించింది. ఆయన భార్య ఇంద్రాణి ముఖర్జీ తన మాజీ భర్త సంజయ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్వర్ రాయ్తో కలిసి 2012లో కుమార్తె షీనాను కారులో గొంతు నులుమి హత్య చేసింది. అనంతరం ఆమె శవాన్ని రాయగడ్ అటవీ ప్రాంతంలో కాల్చి పూడ్చిపెట్టారు.
నిరుడు ఇది వెలుగుచూడటంతో ఈ ముగ్గురు అరెస్టై రిమాండ్లో ఉన్నారు. పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్తో షీనా ప్రేమాయణంతో పాటు కోట్లాది రుపాయల ఆర్థిక లావాదేవీలు ఈ హత్యకు కారణమని కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేసింది. దీనిపై విచారించేందుకు పీటర్ ముఖర్జీని కూడా ఇటీవల అరెస్ట్ చేసింది.
ఆయన నుంచి మరిన్ని విషయాలు రాబట్టేందుకు ముంబై నుంచి ఢిల్లీకి తరలించి రెండు రోజుల పాటు ప్రశ్నించింది. గురువారంతో పీటర్ రిమాండ్ గడువు ముగియడంతో ముంబై తీసుకొచ్చి ప్రత్యేక కోర్టులో హాజరుపర్చింది. ఈ కేసులో కీలకమైన ఆర్థిక లావాదేవీలను ఆయన బయటపెట్టినట్లు తెలుస్తోంది.
దీనిపై లోతుగా విచారించేందుకు కస్టడీ గడువు పొడిగించాలని సీబీఐ కోరడంతో ఈ నెల 30 వరకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఇంద్రాణి కుట్రలో పీటర్ ముఖర్జియా బాధితుడని ఆయన తరుఫు న్యాయవాది వాదించారు. రాహుల్, షీనా సంబంధంపై ఆయనకు ఎలాంటి సమస్య లేదని కోర్టుకు తెలిపారు.