ఆ రాత్రి ఏంజరిగింది...ఫడ్నవీస్ ఏం చేశారు.. ఆర్టీఐలో పిటిషన్, సమాధానం ఇదే..!
గతేడాది చివరిలో రాజకీయాలంతా మహారాష్ట్ర వైపే తిరిగాయన్న సంగతి చూశాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చాక ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఏపార్టీకి రాకపోవడంతో సీట్ల పందేరం ప్రారంభమైంది. అంతేకాదు ఒక పార్టీ ఎమ్యెల్యేలతో మరో పార్టీ అధినాయకత్వం బేరాసారాలు చేసిందనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. దాదాపు నెలనర్ర రోజుల పాటు సాగిన మహా రాజకీయ హైడ్రామా ఒక్కసారిగా బీజేపీ అభ్యర్థి ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ట్విస్ట్ చోటుచేసుకుంది.
పార్టీ, పార్టీ సిద్ధాంతాలు అక్కర్లేదు: యడియూరప్పకు ఫడ్నవీస్ డైరెక్ట్ వార్నింగ్
అప్పటి వరకు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఉండగా రాత్రికి రాత్రే సమీకరణాలు మారిపోవడం, ఉదయం కల్లా రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్లు ఢిల్లీ నుంచి ప్రకటన రావడం అన్నీ జరిగిపోయాయి.. ఆ ఒక్కరాత్రి ఏం జరిగిందన్న విషయం పై ఎంతో మందికి ఎన్నో అనుమానాలు వచ్చాయి. దీనిపై ప్రముఖ జాతీయ వార్తా ఛానెల్ సమాచార హక్కు చట్టం కింద పిటిషన్ దాఖలు చేసింది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది..? ఆర్టీఐ సమాధానం ఏంటి..?
హడావుడిగా ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం
23 నవంబర్ ..2019 ఉదయం 8 గంటలు.. మహారాష్ట్ర రాజ్భవన్ ముందు మీడియా సందడి. దీనంతటికి కారణం ఎంతో గ్రాండ్గా జరగాల్సిన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం రాజ్భవన్లో గోప్యంగా జరగడం. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయడం ఆయన తర్వాత డిప్యూటీ సీఎంగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అప్పటి వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉండగా అదే రోజున ఉదయం 5 గంటలకు ఎత్తివేయడం జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.అయితే మూడు రోజుల తర్వాత పరిణామాలు శరవేగంగా మారడంతో ఫడ్నవీస్కు బలం లేకపోవడంతో తిరిగి రాజీనామా చేశారు. అనంతరం శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ రోజు రాత్రి ఏం జరిగిందన్న దానిపై ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్ ఆర్టీఐలో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నించింది.
వారి ప్రమేయం లేకుండా ప్రమాణస్వీకారం సాధ్యమేనా..?
నవంబర్ 22, 23 మధ్య రాత్రి ఒక్కసారిగా రాజకీయాలు టర్న్ తీసుకున్నాయి. గవర్నర్, ఢిల్లీలోని కేంద్ర కేబినెట్, రాష్ట్రపతి ఈ ముగ్గురు ప్రమేయం లేకుండా అప్పటివరకు రాష్ట్రపతి పాలనలో ఉన్న ఒక రాష్ట్రంలో పాలన ఎత్తివేయడం ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయడం అన్నీ ఆగమేఘాలపై జరిగిపోయాయి. ఈ ముగ్గురు సహకారం లేకపోతే సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేసి ఉండేవారు కాదు. రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలంటే దానికి కొన్ని పద్ధతులు నిబంధనలు ఉన్నాయి. అయితే ఇవేమీ పాటించలేదనేది తెలుస్తోంది.
సమాధానం ఇచ్చేందుకు నిరాకరణ
అయితే తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని దీంతో ఉదయం 5 గంటలకు రాష్ట్రపతి పాలన ఎత్తేసినట్లు ఫడ్నవీస్ చెప్పారు.అయితే ఆ మధ్యరాత్రి ఏం జరిగింది ఎవరు పావులు కదిపారనేదానిపై హోంశాఖ వద్ద ఆర్టీఐలో పిటిషన్ దాఖలు చేయగా ఆర్టీఐ సమాధానం ఇవ్వలేదు. కొన్ని కారణాల వల్ల ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2(f), సెక్షన్ 8(1)(e)ప్రకారం బయటకు వెల్లడించలేమని పేర్కొంది. అనంతరం రాష్ట్రపతి సెక్రటేరియట్లో అప్లికేషన్ దాఖలు చేసింది ఈ ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్. సమాధానం చెప్పకుండా ఆ పిటిషన్ను తిరిగి హోంశాఖకు ఫార్వర్డ్ చేసింది రాష్ట్రపతి సెక్రటేరియట్.
Recommended Video
వాస్తవాలు ఎప్పటికైనా వెలుగులోకి
హోంశాఖ ముందుగా ఏ సమాధానం అయితే ఇచ్చిందో అదే సమాధానం మళ్లీ ఇచ్చింది. ఆర్టీఐ చట్టం ప్రకారం ఈ సమాచారం వెల్లడించలేమని పేర్కొంది. దీంతో తృప్తి చెందని ఆ న్యూస్ ఛానెల్ హోంశాఖ వద్ద అప్పీల్ చేసింది. అయితే సెక్షన్ 8(1)(e)ని అనుసరించి ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ హోంశాఖకు చెందిన ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ చెప్పింది. మొత్తానికి ఆరోజు రాత్రి ఏమైనా జరిగి ఉండొచ్చు.. రాష్ట్రపతి పాలన ఎత్తివేసేలా రాష్ట్రపతికి సిఫార్సు చేయాల్సిందిగా దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ను ఒప్పించి ఉండొచ్చు, ఇలా ఏం జరిగినా అది ప్రభుత్వం రికార్డుల్లో ఉంటాయి. ప్రస్తుతం ఇప్పటికి విఫలమైనా ఎప్పటికీ ఒకే ప్రభుత్వం ఉండదని ఎన్నో ప్రభుత్వాలు వస్తుంటాయి, లేదా పోతుంటాయని ఎప్పుడో ఒకసారి ఈ విషయం బయటకొస్తుందని ఆ ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్ పేర్కొంది.