చిక్కుల్లో శబరిమల ప్రధాన అర్చకుడు?.. సంప్రోక్షణపై సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్
కేరళ : 40 ఏళ్ల లోపు వయసున్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంతో వివాదం రాజుకుంది. ఓవైపు అయ్యప్ప భక్తులు మండిపడుతుంటే.. మరోవైపు ఆలయ ప్రధాన అర్చకుడిని టార్గెట్ చేశారు కొందరు. ఇద్దరు మహిళలు అయ్యప్ప సన్నిధిలోకి రావడంతో ఆలయాన్ని సంప్రోక్షణ చేసిన తీరు వివాదస్పదమైంది.
శబరిమల ఆలయం శుద్ధిచేయడం సుప్రీంకోర్టు ధిక్కారమని వాదిస్తున్నారు కొందరు. ఈనేపథ్యంలో ప్రధాన ఆలయ అర్చకుడిని టార్గెట్ చేస్తూ ఓ లాయర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం చర్చానీయాంశమైంది.
మహిళల ఎంట్రీతో ఆలయ శుద్ధి
ఇద్దరు మహిళలు బుధవారం శబరిమల అయ్యప్పను దర్శించుకోవడం వివాదస్పదమైంది. 50 ఏళ్ల లోపు వయసున్న మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకోవచ్చనే సుప్రీంకోర్టు తీర్పుతో వారిద్దరు శబరికి చేరుకున్నారు. పోలీసుల సాయంతో తెల్లవారుజామున ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో ఆలయ ప్రధాన అర్చకుడు తాత్కాలికంగా ఆలయం మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే శుద్ధి క్రియ ప్రారంభించి ఆలయాన్ని సంప్రోక్షణ చేశారు. దీని కారణంగా దాదాపు రెండు మూడు గంటలు ఆలయం మూతపడింది.
రాంగ్.. రైట్
40 ఏళ్ల లోపు ఇద్దరు మహిళలు శబరిమల ఆలయానికి వెళ్లడాన్ని కొందరు తప్పుబడుతుంటే.. మరికొందరు సమర్థిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తుంగలో తొక్కారనేది కొందరి వాదన. అదలావుంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారు ఆలయంలోకి ప్రవేశించారనేది మరి కొందరి మాట. ఈ క్రమంలో ఆలయాన్ని సంప్రోక్షణ చేయడం ముమ్మాటికీ తప్పేనంటూ వాదిస్తున్నారు. ఈ అంశంపై న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధమవుతున్నారు.
అర్చకుడికి సంప్రోక్షణ ఉచ్చు..!
బుధవారం నాడు ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంతో సంప్రోక్షణ చేయించారు ఆలయ ప్రధాన అర్చకుడు. దీంతో ఆలయంలోకి మహిళలను అనుమతించాలనే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించారంటూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో సుప్రీంకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ వేశారు. న్యాయస్థానం తీర్పును ఆలయ ప్రధాన అర్చకుడు గౌరవించలేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని.. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని పిటిషన్ లో కోరారు.