వలస కార్మికుల కష్టాలపై పిటీషన్ .. విచారణ జరపనున్న సుప్రీం ధర్మాసనం
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ సందర్భంగా ప్రజలు బయటకు రావటానికి వీలు లేదని ప్రభుత్వం ప్రకటన చెయ్యటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వలస కూలీల బతుకు భారంగా మారింది . వందల,వేల కిలోమీటర్ల దూరం కూడా కాలినడకన వెళ్తున్న కూలీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది . ఇక వీరి విషయంలో ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేకపోగా వారిని రాష్ట్రాల సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారు .
లాక్ డౌన్ కారణంగా దేశంలో వేలాది మంది వలస కూలీలు, కార్మికులు, శ్రామికులు పనులు లేక వివిధ నగరాల నుంచి తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో..ఓ గందరగోళ పరిస్థితి ఉత్పన్నమైన విషయం తెలిసిందే . కరోనా నివారణకు ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ కారణంగా రైళ్లు గానీ, బస్సులు గానీ లేక వీరంతా వీధినపడ్డారు. వీరిలో మహిళలు, వృధ్ధులు, అనారోగ్యం బారిన పడినవారు ఉన్నారు. పొట్ట చేతబట్టుకుని వందలాది కిలోమీటర్ల దూరం మేర నడిచి వెళ్తున్న వలస కార్మికుల పరిస్థితిపై అలోక్ శ్రీవాత్సవ్ అనే లాయర్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.
వలస కార్మికులకు ఆహారంగానీ, నీరు గానీ, నిలువనీడ గానీ లేదని, వీరిని ఆదుకోవలసిందిగా కేంద్రాన్ని, రాష్ట్రాలను ఆదేశించాలని ఆయన తన పిటీషన్ ద్వారా సుప్రీం ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇక వలస జీవుల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపధ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు వారిని వారి సొంత ప్రదేశాలకు చేర్చేందుకు బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ కరోనా వైరస్ మరింత ప్రబలుతుందేమోనన్న ఉద్దేశంతో కేంద్రం వారికి ఎక్కడికక్కడ వసతులు కల్పించాలని పేర్కొంది. ఇక వెంటనే వారిని తరలించేందుకు ఏర్పాటు చేసిన ఆ బస్సు సర్వీసులను రద్దు చేసింది. ఆయా రాష్ట్రాలు తమ సరిహద్దులను మూసివేయాలని కేంద్రం ఆదేశించింది. ఇక ఈ వలస కార్మికుల పరిస్థితి ఏంటి? వారిని ఆదుకోవాలని ఈ పిటిషన్ పై సీజెఐ ఎస్.ఏ.బాబ్డే ఆధ్వర్యాన గల ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ విచారణ జరపనుంది.