టీ20 మ్యాచ్ స్కోర్ బోర్డ్లాగా దూసుకెళ్తోన్న పెట్రోల్, డీజిల్ రేట్లు: మళ్లీ పెంపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇవ్వాళ కూడా పెట్రోల్, డీజిల్పై లీటర్పై 35 పైసలు పెరిగింది. టీ20 ప్రపంచకప్ కప్ టోర్నమెంట్లోని స్కోర్ బోర్డ్లాగా పరుగులు తీస్తూనే ఉంది. ఇంధన ధరలు తగ్గుముఖం పడతాయనే ఆశలు ఇక ఏ మాత్రం లేవు. వాటిని వదిలేసుకోవాల్సిందే. ఒక్కరోజు పెంచకపోతే.. వాటి రేట్లను తగ్గించినట్టే అని సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. వరుస బాదుడుతో దేశంలో అనేక చోట్ల పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి 120 రూపాయలకు చేరింది.
లీటర్పై 35 పైసలు..
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్, డీజిల్పై 35 పైసల మేర పెంపుదల కనిపించింది. లీటర్ ఒక్కింటికి 35 పైసల మేర పెంచడాన్ని బెంచ్మార్క్గా పెట్టుకున్నట్టు కనిపిస్తోన్నాయి చమురు కంపెనీలు. తాజాగా పెరిగిన ధరలతో దేశంలోని అనేక నగరాల్లో లీటర్ పెట్రోల్ 115 రూపాయలను దాటింది. డీజిల్ వంద రూపాయల మార్క్ను దాటేసింది. కొన్ని నగరాల్లో డీజిల్ 110 రూపాయలకు చేరువ అయింది.
మూడు రూపాయలు తగ్గించినా.. ఫలితం లేనట్టే
తాజా పెంపుతో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.108.29 పైసలకు చేరింది. డీజిల్ 97.02 పైసలుగా నమోదైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.114.14 పైసలు పలుకుతోంది. అక్కడ డీజిల్ రూ.105.12 పైసలకు చేరింది. కోల్కతలో పెట్రోల్ ధర రూ.108.78 పైసలుగా నమోదైంది. డీజిల్ ధర రూ.100.78 పైసలుగా రికార్డయింది. చెన్నైలో పెట్రోల్ రూ.105.13 పైసలు, డీజిల్ ధర రూ.101.25 పైసలుగా ఉంటోంది. పెట్రోల్ అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం మూడు రూపాయల మేర పన్నును తగ్గించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయినట్టయింది.
బాదుడులో స్పీడ్..
రేట్లు ఎక్కడికి వెళ్లి ఆగుతాయనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచడంతో రేట్లు మరింత వేగంగా పైపైకి దూసుకెళ్తున్నాయి. పెట్రోల్, డీజిల్ లీటర్ ఒక్కింటికి 35 పైసల మేర చొప్పున పెంచుతూ వస్తోండటం వల్ల మూడు రోజుల్లోనే ఒక రూపాయిని దాటస్తున్నాయి వాటి ధరలు. ఇలా ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు. రేట్లు తగ్గే అవకాశం ఏ మాత్రం కూడా కనిపించట్లేదు.
ధరలు ఆకాశానికి..
ఈ మధ్యకాలంలో ప్రతిరోజూ ధరలు పెరుగుతున్నాయి. ఒకట్రెండు రోజుల విరామం లభిస్తోందే తప్ప.. పెరుగుదల అక్కడితో ఆగట్లేదు. ఆ విరామం ప్రకటించిన రోజుల్లో నెలకొన్న లోటును కూడా భర్తీ చేసుకునేలా పెట్రోల్, డీజిల్ రేట్లను భగ్గు మనిపిస్తున్నాయి చమురు సంస్థలు, ఈ ఏడాది మే 4వ తేదీన మొదలైన పెరుగుదల.. ఈ అయిదు నెలల పాటు వాహనదారులకు చుక్కలు చూపిస్తూ వచ్చింది. 45 నుంచి 50 రోజుల పాటు ప్రతిరోజూ వాటి రేట్లు పెరిగాయి. మధ్యలో కొంత విరామం తీసుకున్నాయి. మళ్లీ ఆకాశానికి ఎగబాకడం మొదలు పెట్టాయి. ఈ అయిదు నెలల్లో 50 రూపాయల వరకు పెరిగాయి వాటి రేట్లు.
తగ్గింపు అత్యాశే..
రోజువారీ పెరుగుదలలో అడపాదడపా కొంత విరామం లభిస్తోందే తప్ప.. రేట్లు మాత్రం తగ్గట్లేదు. రెండు రోజులు బ్రేక్ ఇస్తే.. వారం రోజుల పాటు వాటి ధరలను పెంచే పరిస్థితి దేశంలో నెలకొంది. ఈ రోజుతో ఇంధన ధరలను పెంచడాన్ని చమురు సంస్థల ఆపివేస్తాయని ఏ రోజుకు ఆ రోజు అనుకోవడం ఓ అత్యాశగానే మిగిలిపోయింది. ప్రతిరోజు వాహనదారులను బాదడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు కనిపిస్తోన్నాయి చమురు సంస్థలు. ఇదివరకట్లా మళ్లీ వరుసగా వాటి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచబోవనే గ్యారంటీ ఉండట్లేదు.