పెట్రో ధరల పాపం గత ప్రభుత్వాలదే -ప్రధాని మోదీ ఫైర్ -ఆయిల్, గ్యాస్ దిగుమతులపై ఆశ్చర్యం
petrol@100, దేశంలో ఇంధన ధరల భగభగలపై సామాన్యులు ఊసురోమంటోన్న వేళ.. పలు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 మార్కును తాకిన తరుణాన.. ఇంకొద్ది రోజుల్లోనే డీజిల్ ధర సైతం పెట్రోల్తో సరిసమానం అవుతోందన్న అంచనాల నడుమ.. ధరల పెంపుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ పాపం గత ప్రభుత్వాలదేనని నిందించారు.
జడ్జి పుష్పకు 150 కండోమ్లు పంపిన మహిళ -రేప్ కేసుల్లో వివాదాస్పద తీర్పులకు నిరసనగా..
గత పాలకుల వల్లే..
పెట్రో ధరల పెంపుపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఆ అంశంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంధనం కోసం మన దేశం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతోందని, ఇది సరైనదేనా! అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఈ అంశంపై శ్రద్ధ తీసుకోనందునే ఇవాళ ఇలాంటి పరిస్థితి నెలకొందని ఆక్షేపించారు. బుధవారం ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి ఎన్నికల రాష్ట్రం తమిళనాడులో వివిధ ఆయిల్, గ్యాస్ ప్రాజెక్టులను ఆన్ లైన్ లో ప్రారంభించిన ఆయన ఈ మేరకు కీలక ప్రసంగం చేశారు..
ఈ స్థాయిలో దిగుమతులా!!
2019-20 ఆర్థిక సంవత్సరంలో మన దేశ అవసరాల్లో 85 శాతం ఆయిల్ను, 53 శాతం గ్యాస్ను దిగుమతి చేసుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. వైవిధ్యభరితమైన, ప్రతిభా సంపన్నమైన మనలాంటి దేశం ఇంధనం కోసం దిగుమతులపై ఇంతగా ఆధారపడవచ్చునా! అని ప్రధాని ప్రశ్నించారు. గత పాలకులకు దూరదృష్టితో వ్యవహరించి ఉంటే గనుక ఇవాళ పేద, మధ్యతరగతి ప్రజలు ఇంతగా ఇబ్బంది పడేవారు కాదని, అయితే ఈ విషయంలో తాను ఎవరినీ విమర్శించదల్చుకోలేదని మోదీ అన్నారు. ఇక..
పెట్రోల్లో ఇథనాల్ కలుపుదాం..
పెరిగిన పెట్రో ధరల కారణంగా మధ్య తరగతి ప్రజలు పడుతోన్న అవస్తలు, వారి ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోగలదని ప్రధాని వ్యాఖ్యానించారు. కాగా, రైతులు, వినియోగదారులకు ఉపయోగపడేందుకు ఇథనాల్పై మన దేశం దృష్టి సారించిందని తెలిపారు. చెరకు నుంచి తీసిన ఇథనాల్ను పెట్రోలుకు కలుపుతున్నట్లు, తద్వారా దిగుమతులను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పెట్రోలులో 8.5 శాతం ఇథనాల్ ఉంటోందని, దీనిని 2025 నాటికి 20 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని చెప్పారు. దీనివల్ల దిగుమతులు తగ్గడంతోపాటు, రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం లభిస్తుందన్నారు. అంతేకాదు..
ఆయిల్ వాడకం తగ్గేలా..
పెట్రోల్, డీజిల్, గ్యాస్ దిగుమతులను క్రమంగా తగ్గించుకోవడంతోపాటు Renewable fuels (పునరుద్ధరణీయ ఇంధనాల) వాడకంపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు ప్రధాని తెలిపారు. 2030 నాటికి దేశంలో ఉత్పత్తి అయ్యే ఇంధనంలో 40 శాతం పునరుద్ధరణీయ ఇంధనం ఉంటుందన్నారు. సౌరశక్తి వినియోగం పెరిగిందని, ప్రజా రవాణా, ఎల్ఈడీ బల్బుల వినియోగం, నిర్దిష్ట కాలపరిమితి దాటిన వాహనాలపై నిషేధం, సాగు నీటి పారుదలలో సోలార్ పంపుల వాడకం వంటి చర్యలను అమలు చేస్తున్నట్లు మోదీ తెలిపారు.
భారత్ పెట్రో ఎగుమతులు పెరిగాయ్..
2019-20 ఏడాదిలో చమురు శుద్ధి సామర్థ్యంలో భారత్ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉందని, దాదాపు 65.2 మిలియన్ టన్నుల పెట్రోలియం ప్రొడక్ట్స్ను ఎగుమతి చేస్తున్నామని, ఈ ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రస్తుతం భారత దేశ చమురు, సహజ వాయువు కంపెనీలు 27 దేశాల్లో ఉన్నాయని గుర్తుచేశారు. ఇక, మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో పలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ ఇవాళ శ్రీకారం చుట్టారు. వాటిలో.. రామనాథపురం - తూత్తుకుడి సహజవాయువు పైప్లైన్, గ్యాసోలిన్ శుద్ధి యూనిట్, నాగపట్నం వద్ద కావేరి బేసిన్ రిఫైనరీ తదితర ప్రాజెక్టులున్నాయి. గడిచిన 6ఏళ్లలో కేవలం ఆయిల్, గ్యాస్ రంగాల్లోనే తమిళనాడుకు రూ.50వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను అందజేశామని ప్రధాని మోదీ గుర్తుచేశారు.
ప్రత్యేక రాయలసీమకు వైఎస్ షర్మిల -ఒకటికి కోటి బాణాలు -కేసీఆర్ బర్త్డేలో గంగుల సంచలనం