టీటీవీ దినకరన్ ఇంటిపై పెట్రో బాంబు దాడి యత్నం, కారులో పేలింది
చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ అధినేత, ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ఇంటిపై ఆదివారం పెట్రో బాంబు దాడికి ప్రయత్నం జరిగింది. ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఓ కారు ధ్వంసమైంది. ఆ సమయంలో దినకరన్ లేరు.
ఇటీవల బుల్లెట్ పరిమళం అనే వ్యక్తిని పార్టీ నుంచి తొలగించారు. దీంతో దినకరన్పై పగ పెంచుకున్న పరిమళం ఆయన ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరాలని నిర్ణయించుకున్నాడు. బాంబును కారులో తీసుకుని ఆదివారం మధ్యాహ్నం దినకరన్ ఇంటి సమీపానికి చేరుకున్నాడు.
ఆ సమయంలో పెట్రోల్ బాంబు అదే కారులో పేలింది. ఈ ఘటనలో కారులోని ముగ్గురు వ్యక్తులతో పాటు సమీపంలో ఉన్న ఓ ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలిసిన పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి బుల్లెట్ పరిమళాన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.