బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి, పెరియార్, ప్రతీకారం, తమిళనాడులో చిచ్చు!
Recommended Video
కోయంబత్తూరు/చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరులో బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ కోయంబత్తూరు జిల్లా కేంద్ర కార్యాలయంపై యువకులు పెట్రోల్ బాంబుతో దాడి చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పెరియార్ విగ్రహాలకు, బీజేపీ కార్యాలయాల దగ్గర పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
పెట్రోల్ బాంబు
బుధవారం వేకువ జామున కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయం దగ్గరకు ఇద్దరు యువకులు బైక్ లో వచ్చారు. తరువాత వెంట తీసుకు వెళ్లిన పెట్రోల్ బాంబును బీజేపీ కార్యాలయం మీదకు విసిరి అక్కడి నుంచి పరారైనారు.
సీసీ కెమెరాలు
కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయం మీద పెట్రోల్ బాంబుతో దాడి చేసిన సమయంలో సమీపంలో ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయి. బీజేపీ కార్యాలయంలో ఉన్న ఓ వ్యక్తి యువకులను పట్టుకోవడానికి ప్రయత్నించిన దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి.
లొంగిపోయిన యువకుడు
కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబుతో దాడి చేసిన కేసులో తంతి పెరియార్ ద్రావిడ కలగం (టీపీడీకే)కు చెందిన బాలు అనే యువకుడు బుధవారం కోయంబత్తూరు పోలీసుల ముందు లొంగిపోయాడు.
పెరియార్ విగ్రహం, ప్రతీకారం
పెరియార్ విగ్రహాలను ధ్వంసం చెయ్యాలని బీజేపీ నాయకుడు హెచ్. రాజా పిలుపునిచ్చారని, అందుకు నిరసనగా తాను పెట్రోల్ బాంబుతో దాడి చేశానని బాలు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఇప్పటికే పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో బీజేపీ, సీపీఐకి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీలో డీఎంకే ఆందోళన
పెరియార్ విగ్రహాలు ధ్వంసం చెయ్యాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్. రాజా పిలుపునివ్వడంతో ఢిల్లీలో డీఎంకే పార్టీకి చెందిన నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో బీజేపీ వర్గ రాజకీయాలకు పిలుపునిచ్చి తమిళ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తోందని డీఎంకే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు.