దేశ చరిత్రలోనే గరిష్ట స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు..
హైదరాబాద్: దేశచరిత్రలోనే పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో గత కొద్దిరోజుల పాటు పెరగని పెట్రో, డీజిల్ రేట్లు.. ఆదివారం నాడు అకస్మాత్తుగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
ప్రస్తుతం ఢిల్లీ మార్కెటులో లీటరు పెట్రోల్ ధర రూ.76.24గా ఉంది. దేశంలోని మెట్రో నగరాలన్నింటిలో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. మిగతా నగరాల్లో.. ముంబైలో రూ.79.13, చెన్నై, కోల్ కతాల్లో రూ.78.19గా ఉంది. అన్ని రకాల పన్నులు కలుపుకుని హైదరాబాద్ లో రూ.80.76, విజయవాడలో లీటరు పెట్రోలు ధర రూ.82.8కి చేరుకుంది.
ఇక డీజిల్ విషయానికొస్తే.. దేశ చరిత్రలోనే గరిష్టంగా రూ.67.57కి పెరిగింది. హైదరాబాదులో లీటర్ డీజిల్ ధర రూ.73.45 కాగా.. త్రివేండ్రంలో రూ.73.45, రాయ్ పూర్ రూ.72.96, గాంధీనగర్ రూ.72.63, భువనేశ్వర్ రూ.72.43గా ఉంది. ముంబైలో రూ.71.94, కోల్ కతా, చెన్నైల్లో రూ.71.32గా ఉంది.
పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో విపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అడ్డగోలుగా పన్నులు బాదుతూ పోవడం వల్లే పెట్రోల్, డీజిల్ రేట్లు అంతకంతకూ పెరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.