షాక్:పెరుగుతున్న పెట్రోల్, డీజీల్ ధరలు, రానున్న రోజుల్లో లీటర్కు రూ.4 పెరిగే ఛాన్స్?
న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తైన తర్వాత పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా సుమారు 19 రోజుల పాటు పెట్రోల్, డీజీల్ ధరలు పెరగలేదు. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజీల్ లపై లీటర్ కు రూ. నాలుగు వరకు ధరలు పెరిగే అవకాశం లేకపోలేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Recommended Video
కర్ణాటక పోలింగ్ ముగిసిన వెంటనే పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. 19 రోజుల పాటు పెట్రోల్, డీజీల్ ధరలు పెంచకుండా ఉండడం వల్ల ఆయిల్ కంపెనీలు వచ్చిన నష్టాలను పూడ్చుకొనేందుకు విపరీతంగా ఈ ధరలను పెంచుతున్నారు.
గత శుక్రవారం నుండి పెట్రోల్, డీజీల్ ధరల పెరుగుతున్నాయి. లీటర్పై పెట్రోల్ సుమాు 29 పైసల వరకు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు రూ. 75.61కు చేరుకొంది. ఎన్నికలకు ముందు లీటర్ పెట్రోల్ ధర రూ. 75.32 పైసలు ఉండేది. లీటర్ డీజీల్ ధర 66.79 నుండి67.08 రూపాయాలకు చేరుకొంది.
లీటర్ పెట్రోల్ ధర ముంబైలో గరిష్టానికి చేరుకొంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.45లకు చేరుకొంది. డీజీల్ ధర లీటర్ కు రూ.71.42లకు చేరుకొంది.హైద్రాబాద్లో డీజీల్ ధర రూ.72.91కు చేరుకొంది. అయితే రానున్న రోజుల్లో పెట్రోల్, డీజీల్లపై సుమారు మూడు నుండి నాలుగు రూపాయాలను పెంచే అవకాశం లేకపోలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
పెట్రోల్, డీజీల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల కారణంగా వినియోగదారులపై పెను భారం పడుతోంది.తక్కువ ధరకే పెట్రోల్, డీజీల్లను వినియోగదారులకు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి.
మరోవైపు పెట్రోల్, డీజీల్ లను కూడ జీఎస్టీ పరిధిలోకి తెస్తే వినియోగదారులకు ఇబ్బందులు తొలిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఈ తరుణంలో ఈ దిశగా కేంద్రం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.