పెట్రోల్, డీజీల్ ధరలు పైపైకి, వినియోగదారుల జేబులకు చిల్లు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజీల్ ధరలు ఆరో రోజు కూడ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజీలు ధరలను పెంచాల్సి వచ్చిందని చమురు కంపెనీలు ప్రకటిస్తున్నాయి.
పెట్రోల్ ధరలు ఆరు నుండి ఏడు పైసలు పెరిగాయి, డీజీల్ దరలు కూడ ఏడు నుండి 8 పైసలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ ఈ ధరలు పెరిగినట్టు చమురు కంపెనీలు ప్రకటించాయి.
ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.72.39కు చేరుకొంది. కోల్కత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 75.12కు చేరుకొంది. ముంబైలో రూ.80.26కు చేరుకొంది. చెన్నైలో రూ. 75.07కు చేరుకొంది. నాన్ బ్రాండెడ్ డీజీల్ ధర లీటర్ కు ఢిల్లీలో రూ.62.96కు చేరుకొంది.
గత ఏడాది జూన్ నుండి ప్రతి రోజు పెట్రోల్, డీజీల్ ధరలను సమీక్షిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటివరకు పెట్రోల్ ధర లీటర్ కు సుమారు. రెండున్నర రూపాయాలు, డీజీల్ ధర లీటర్కు మూడున్నర రూపాయాలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినందునే ఈ ధరలను పెంచాల్సి వచ్చిందని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి.