11వ రోజు పెరిగిన పెట్రో ధరలు, రాష్ట్రాలు పన్ను తగ్గించినా సరిపోతుంది: శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం
న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు గురువారం కూడా పెరిగాయి. వరుసగా 11వ రోజు ఆయిల్ కంపెనీలు ధరలను పెంచాయి. ముంబైలో అధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ.85.29కి చేరింది. డీజిల్ ధర లీటర్ 72.96గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 77.49గా, డీజిల్ ధర 68.53గా ఉంది.
మరోవైపు, కేంద్రం తాత్కాలికంగా, వాహనదారులకు ఇప్పటికిప్పుడు ఊరటను ఇచ్చేలా కాకుండా దీర్ఘకాలిక పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తోంది. మోడీ ప్రభుత్వం దీర్ఘకాలిక భారత ప్రయోజనాల కోసం పని చేస్తుందని బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నా దీర్ఘకాలిక పరిష్కారం అంటే జీఎస్టీలోకి తీసుకువచ్చే అవకాశముందా లేక మరేదైనా చేస్తారా అనే ఆసక్తి కనిపిస్తోంది.
ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మాట్లాడుతూ.. ధరల్ని నియంత్రించే ప్రణాళికపై కేంద్రం పని చేస్తోందని, మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం వెలువడొచ్చని తెలిపారు.
ప్రభుత్వ రంగ చమురు కంపెనీ హెచ్పీసీఎల్ చైర్మన్, ఎండీ ముకేష్ కుమార్ సురానా మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్పై పన్నుల విధానాన్ని సమీక్షించడం ద్వారా వినియోగదారులకు ఊరట లభిస్తుందన్నారు. తాము ఎక్కువగా అమ్మకాలపై ఆధారపడ్డామని, లాభాల మార్జిన్ తక్కువగా ఉందని, అంతర్జాతీయంగా ధరలు పెరుగుతుంటే ఏం చేయలేమన్నారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుపై కేంద్రం పరిశీలిస్తుందన్నారు. అలాగే రాష్ట్రాలలో స్థానిక పన్నులను తగ్గించినా ధరలు దిగొస్తాయన్నారు.
పెట్రో ధరలపై దీర్ఘకాలిక పరిష్కారం కోసం కసరత్తు
పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తరుచూ సవరణకు గురయ్యే పరిస్థితిని నివారించేందుకు దీర్ఘకాలిక పరిష్కారం చూపించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు కేంద్రం బుధవారం వెల్లడించింది. పది రోజులుగా ధరలు పెరుగుతుండటంతో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించుకోవాలని ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి రవిశంకరప్రసాద్ మాట్లాడారు. పెరుగుతున్న పెట్రో ధరలకు పరిష్కారం చూపాల్సి ఉందని, ఏదో తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా దీర్ఘకాలిక పరిష్కారంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.