కర్నాటక ఎన్నికల ఎఫెక్ట్: 6 రోజులుగా మారని పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరల్లో రోజువారి మార్పులు వచ్చాయి. అయితే ఆరు రోజులుగా ఈ ధరల్లో మార్పు లేదు. అందుకు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలే కారణమని భావిస్తున్నారు. దేశీయ చమురు సంస్థలు గత మంగళవారం నుంచి ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో గత మంగళవారం పెట్రోల్ ధర లీటర్కు రూ. 74.63, డీజిల్ ధర రూ. 65.93గా ఉంది. అప్పటి నుంచి ఈ ధరలు అలాగే ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పులు ఉన్నప్పటికీ దేశీయ చమురు సంస్థలు ధరలను సవరించడం లేదు. కర్నాటక ఎన్నికల నేపథ్యంలో ధరలు పెంచవద్దని ప్రభుత్వం కోరినట్లుగా తెలుస్తోంది.
సాధారణంగా ఎన్నికలకు ముందు ఏ ప్రభుత్వమైనా చమురు సంస్థలకు ఇలాంటి ఆదేశాలివ్వడం సాధారణమే. ఇదిలా ఉండగా, ఇటీవలే చమురు ధరలు నాలుగేళ్ల గరిష్ఠానికి చేరాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు రోజువారి సవరణలతో ధరలు గరిష్ఠంగా పెరిగాయి.