సౌదీపై డ్రోన్ల దాడి ఎఫెక్ట్: మనదేశంలో భారీగా పెరగనున్న పెట్రో ధరలు, ఎంతంటే..?
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఒకేసారి భారీగా పెరగనున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న తాజా పరిణామాల కారణంగా మనదేశంలో పెట్రోల్ లీటర్పై రూ.5-7 పెరిగే అవకాశం ఉంది. దీంతో వాహనదారులకు తిప్పలు తప్పేలా లేవు. కాగా, ఈ ధరల పెరుగులకు సౌదీ అరేబియాపై జరిగిన దాడులే కారణం.
డ్రోన్ దాడుల ఎఫెక్ట్: సౌదీలో సగానిపైగా నిలిచిన చమురు ఉత్పత్తి
సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరాంకోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమన్ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ చమురు క్షేత్రం ప్రపంచంలోనే పెట్రో ఉత్పత్తుల ప్రాసెసింగ్ చేసే అతి పెద్ద కంపెనీల్లో ఒకటి. యెమన్ హుతీ రెబెల్స్ చేసిన డోన్ల దాడిలో సౌదీలోని అబక్ అండ్ ఖురాయిస్లో ఉన్న చమురు క్షేత్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఈ క్రమంలో తమ ఉత్పత్తిని సగానికిపైగా తగ్గించింది ఆ కంపెనీ. వచ్చు రెండు రోజుల వరకు ఆయిల్ ఉత్పత్తిని సగం వరకు తగ్గించనున్నట్లు ప్రకటించింది కూడా. దెబ్బతిన్న చమురు క్షేత్రాలను బాగు చేసిన తర్వాతే ఉత్పత్తిని పెంచుతామని తెలిపింది. వీలైనంత త్వరలో పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రక్రియ మొదలవుతుందని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో వచ్చే 15 రోజుల్లో లీటర్ పెట్రోలుపై రూ.5 నుంచి రూ. 7 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. త్వరలో పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉందని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ తెలిపింది. ఇది ఇలావుంటే, గత 28ఏళ్లలో ఎన్నడూ లేనంతగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు సోమవారం 20శాతం పెరగడం గమనార్హం.