అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 190
ఇంఫాల్: మణిపూర్ ప్రజలు అనేక విధాలుగా కష్టాలు ఎదుర్కుంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఒక లీటర్ పెట్రోల్ రూ. 190 విక్రయిస్తున్నారు. అవసరం కాబట్టి ప్రజలు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.
ఇన్నర్ లైన్ పర్మిట్ విధానాన్నిఅమలు చెయ్యాలని మణిపూర్ లో జరుగుతున్న హింసాత్మక ఆందోళన అక్కడి ప్రజల జీవితంపై తీవ్రప్రభావం చూపిస్తోంది. ఇంఫాల్-డిమాపూర్, ఇంఫాల్- సిల్చార్ జాతీయ రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి.
రెండు జాతీయ రహదారులు మూసుకుపోవడంతో మణిపూర్ లోకి సరుకులు వచ్చే మార్గం లేకుండ పోయింది. ఇంఫాల్-డిమాపూర్ జాతీయ రహదారిలో ఆగస్టు నెలలో భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో అక్కడి రోడ్డు మార్గం మొత్తం మూసుకుపోయింది.
మరమ్మత్తుల పనులు ఇంకా పూర్తి కాలేదు. ఆందోళన కారణంగా ఇంఫాల్-సిల్చార్ జాతీయ రహదారి మూసుకుపోయింది. రెండు జాతీయ రహదారులు మూసుకుపోవడంతో చాల రోజుల నుంచి నిత్యవసర వస్తువులు రావడం లేదు.
రాష్ట్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ ఆద్వర్యంలో పెట్రోల్ రేషన్ పద్దతిలో విక్రయిస్తున్నారు. ఒక లీటర్ పెట్రోల్ కొనుగోలు చెయ్యాలంటే సుమారు నాలుగు గంటలు పడుతుంది. లీటర్ పెట్రోల్ రూ. 190 లెక్కన విక్రయిస్తున్నారు.
బ్లాక్ లో విచ్చలవిడిగా పెట్రోల్ విక్రయిస్తున్నారని ఇంఫాల్ నగర వాసులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా ఉల్లి, బంగాళా దుంపలు, పప్పు ధాన్యాలు, ఆకు కూరల ధరలకు రెక్కలు వచ్చాయి. అన్ని రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు.