మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. అక్కడ లీటర్ పెట్రోల్ రూ.80
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇందనం ధరలు క్రమంగా పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా మెల్లగా పెరుగుతూ వస్తున్న ఇందనం ధరలు... శుక్రవారం రోజున లీటర్ పెట్రోల్ ధర ఒక్కసారిగా రూ.80 మార్క్ను తాకింది. దీంతో వాహనదారులు తమ వాహనాలను వినియోగించడం కంటే ప్రభుత్వ రవాణా సంస్థలను ఆశ్రయించడం మేలు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.74.34గా ఉండగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ రూ.80కి చేరింది.
వివిధ నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు
మరోవైపు న్యూఢిల్లీలో డీజిల్ ధరలో ఎలాంటి పెరుగుదల కనిపించలేదు. లీటరు డీజిల్ ధర రూ.67.14 ఉండగా... ముంబైలో లీటరు డీజిల్ ధర 11 పైసలు పెరిగి రూ.70.55కు చేరుకుంది. కోల్కతాలో కూడా ఇందనం ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్ ధర రూ. 77.03గా ఉండగా డీజిల్ ధరల 69.66గా ఉంది. ఇక చెన్నై నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ. 77.28గా ఉండగా డీజిల్ ధర 71.09గా ఉంది. నోయిడా వాహనదారులు లీటరు పెట్రోల్ కోసం రూ. 75.77 రూపాయలు చెల్లిస్తుండగా అదే లీటర్ డీజిల్కు రూ. 67.56 వెచ్చిస్తున్నారు. గురువారం రోజున నోయిడాలో లీటర్ డీజిల్ ధర రూ.67.46గా ఉన్నింది. అదే లీటర్ పెట్రోల్ ధర రూ.75.66గా ఉన్నింది.
గత పది రోజులుగా పెరుగుతున్న ఇందనం ధరలు
ఇదిలా ఉంటే వరుసగా 10 రోజుల నుంచి ఇందన ధరలు పెరుగుతున్నాయి. ఒక్క బుధవారం మాత్రం ఇందనం ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. సౌదీ అరేబియా ఆయిల్ స్థావరాలపై క్షిపణి దాడులు జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇందనం సరఫరా 5శాతం తగ్గింది. గల్ఫ్ దేశాల మధ్య ఆయిల్ యుద్ధం నడుస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు. సౌదీ అరేబియా ఆయిల్ సంస్థలపై దాడులు జరగడంతో ఆ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని ప్రభావం అటు సౌదీతో పాటు ప్రపంచదేశాలపై పడకుండా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
భారత్కు సప్లైలో ఎలాంటి తేడా ఉండదు
సౌదీ ఆయిల్ సంస్థపై దాడులు చేసేందుకు డ్రోన్లు మరియు క్రూయిజ్ క్షిపణులను వినియోగించారు. దీంతో 5.7 మిలియన్ బ్యారెల్స్ మేరా ఇందనం ఉత్పత్తికి నష్టం జరిగింది. చరిత్రలో ఇంత పెద్ద స్థాయిలో ఆయిల్ సంస్థకు బ్రేక్ పడటం ఇదే తొలిసారి కావడం విశేషం. సౌదీ అరేబియా కొత్త ఇందనం శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్తో భారత ఇందన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్కు రావాల్సిన వాటాలో ఏమాత్రం తేడా ఉండదని ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ హామీ ఇచ్చినట్లు ప్రధాన్ తెలిపారు.