మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: వరుసగా 15వ రోజు, జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే?..
Recommended Video
న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు ఇప్పట్లో దిగొచ్చేలా కనిపించడం లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత రోజురోజుకు పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలు.. వరుసగా 15వ రోజు కూడా ఎగబాకాయి. సోమవారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.79.27కి చేరుకుంది. డీజిల్ రూ.69.17కి చేరుకుంది. పెట్రోల్ ధర 15పైసల మేర పెరగ్గా.. డీజిల్ ధర 11పైసల మేర పెరిగింది.
దేశంలోని మెట్రో నగరాల్లో ధరల జాబితా:
ఇక దేశంలోని మిగతా మెట్రో నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. కోల్ కతాలో లీటరు పెట్రోల్ ధర కోల్ కతాలో రూ.80.76, ముంబైలొ రూ.85.93, చెన్నైలో రూ.81.11గా ఉంది. కోల్ కతా, ముంబైల్లో పెట్రోల్ ధర 15పైసల మేర పెరగ్గా.. చెన్నైలో 16పైసలు పెరిగింది. కాగా, అంతకుముందు కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో రెండు వారాల వరకు పెట్రోల్ ధరలు పెరగకుండా ఆయిల్ కంపెనీలు చర్యలు తీసుకున్నాయి.
జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే..
చమురు ధరల పెరుగుదలతో పాటు ఎక్సైజ్, వ్యాట్ ల పేరుతో అధిక పన్నులు వసూలు చేస్తున్నందువల్లే.. ధరల పెరుగుతున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజీల్ లను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కొంతమంది డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ప్రభుత్వం గనుక పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోని 28శాతం స్లాబు కిందకు తీసుకువస్తే ధరలు చాలామేరకు తగ్గుతాయి. లీటరు పెట్రోల్ ధర రూ.26.9మేర, డీజిల్ ధర రూ.15.4మేర తగ్గుతుంది.
జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చినా..
పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చినంత మాత్రానా పెద్దగా మార్పు ఏమి ఉండదన్నారు బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ. అప్పుడు రాష్ట్రాలు తమ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి వేరే రూపాల్లో మరిన్ని పన్నులు బాదుతాయన్నారు.
మోడీ సర్కార్ కొలువుదీరిన నాటి నుంచి
ప్రస్తుతం లీటరు పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం రూ.19.48, డీజిల్ పై రూ.15.33 ఎక్సైజ్ సుంకం విధిస్తోంది. ఇదిగాక ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్ అదనం. ఇది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. కేంద్రంలో మోడీ సర్కార్ కొలువుదీరిన దగ్గరినుంచి ఇప్పటిదాకా లీటరు పెట్రోల్ ధరపై రూ.11.17, డీజిల్ ధరపై రూ.13.47 ఎక్సైజ్ సుంకం పెరిగింది.