మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్-విజయవాడల్లో ధర ఎంత అంటే?
ఢిల్లీ: పెట్రోల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. రికార్డ్ స్థాయికి ధరలు పెరిగాయి. గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ.85.35, డీజిల్ రూ.78.98గా ఉంది. పెట్రోల్ ధరలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి.
పెరుగుతున్న పెట్రోల్ ధరలపై విపక్షాలు సోమవారం భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. భారత్ బంద్కు ముందు రోజు పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరల పెరుగుదలపై శివసేన బీజేపీపై విమర్శలు గుప్పించింది. అచ్చేదిన్ అంటే ఇదేనా అని ఎద్దేవా చేసింది.
పెట్రోల్ ధరలు ఢిల్లీలో 80.50గా, డీజిల్ ధర రూ.72.61గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధరలు 83.54, డీజిల్ ధర రూ.75.75గా ఉంది. కోల్కతాలో పెట్రోల్ ధర రూ.83.27గా, డీజిల్ 75.46, ముంబైలో పెట్రోల్ ధర 87.89గా, డీజిల్ రూ.77.09గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.86.81గా, డీజిల్ రూ.80గా ఉంది.
కాగా, పెట్రోల్ ధరలు పెరగడానికి అంతర్జాతీయస్థాయి కారణాలు ఉంటాయి. మరోవైపు, గత యూపీఏ ప్రభుత్వం చేసిన వేలాది కోట్ల అఫ్పును నేటి ఎన్డీయే ప్రభుత్వం తీర్చిందని, అందుకు కూడా ధరలు తగ్గడం లేదని చెబుతున్నారు. పెట్రోల్ ధరలు మన్మోహన్ సింగ్ హయాంలో కూడా రూ.80 దాకా ఉన్నాయని, నాటితో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగింది ఎక్కువ కాదనే వాదనలు కూడా ఉన్నాయి.
కాగా, పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గాలంటే నవంబర్ వరకు నిరీక్షించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. నాలుగు రాష్ట్రాల శాసనసభలకు ఆ నెలలో ఎన్నికలు జరిగే అవకాశముంది.